హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): డ్రగ్స్ మహమ్మారిని కూకటివేళ్లతో పెకిలించి వేస్తామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. డ్రగ్స్ విక్రేతలు హైదరాబాద్ విడిచి వెళ్లాలని, లేదంటే ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. హైదరాబాద్ సీపీగా నియమితులైన ఆయన బుధవారం బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లోని పోలీస్ కమిషనరేట్లో మాజీ కమిషనర్ సందీప్ శాండిల్య నుంచి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ మహానగరంలో విధి నిర్వహణ సవాళ్లతో కూడుకున్నదని తెలిపారు. శాంతి భద్రతలను పరిరక్షిస్తూ గ్యాం బ్లింగ్, డ్రగ్స్ లాంటి సమాజానికి హానిచేసే వాటిని నిర్మూలిస్తూ ముందుకు సాగుతామని పేర్కొన్నారు. క్విక్ రెస్పాన్స్కు అధిక ప్రాధాన్యం ఇస్తామని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ప్రజలకు భరోసా కల్పిస్తామని తెలిపారు. ఈవ్టీజింగ్, ర్యాగింగ్ను పూర్తిగా నిరోధించేందుకు షీటీమ్స్తో కలిసి ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. ట్రాఫిక్ నియంత్రణ జీవనదిలాంటిదని పేర్కొన్న సీపీ.. దానిపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉన్నదన్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా పనిచేసిన అనుభవం తనకు కలిసి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
డ్రగ్స్ వినియోగాన్ని ప్రోత్సహించవద్దు
తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో సీఎం రేవంత్రెడ్డి ముందుకు వెళ్తున్నారని సీపీ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. యువతను నాశ నం చేసే డ్రగ్స్ వంటి మహమ్మారిని కూకటివేళ్లతో నిర్మూలించేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సైబరాబాద్, రాచకొండ పోలీసుల సమన్వయంతో మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు. డ్రగ్స్ వాడకం లేకుంటే సరఫరా కూడా ఉండదని, డ్రగ్స్ నిర్మూలనకు గత పోలీస్ కమిషనర్ల హయాంలో అనేక చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. డ్రగ్స్ విక్రయించే ముఠాలు నగరాన్ని, రాష్ర్టాన్ని విడిచి వెళ్లాలని ఆదేశించారు. లేదంటే పోలీసులు వదలరని హెచ్చరించారు. పబ్లు, రెస్టారెంట్లతోపాటు సినిమా రంగంలోనూ డ్రగ్స్ వినియోగం ఎక్కువగా ఉన్నట్టు సమాచారం ఉన్నదని, ఇలాంటివి ప్రోత్సహించవద్దని యాజమాన్యాలకు హెచ్చరికలు జారీ చేశారు. త్వరలోనే చిత్ర పరిశ్రమ పెద్దలతోపాటు యూనియన్లు, పబ్ల యాజమాన్యాలతో సమావేశమవుతామన్నారు.
సైబర్ క్రైం దర్యాప్తుల్లో తెలంగాణ టాప్
సైబర్ నేరాలకు సంబంధించిన కేసుల దర్యాప్తులో తెలంగాణ పోలీసు లు దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నార ని సీపీ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. దీనిని ఇలాగే కొనసాగిస్తూ మరింత పకడ్బందీగా ముందుకెళ్తామన్నారు. ప్రజల పన్నులతో జీతాలు తీసుకుంటున్న తాము వారికి మరింత మెరుగైన సేవ లు అందించేందుకు నిరంతరం కృషి చేస్తామన్నారు. తనతోపాటు ప్రతి ఒక్క అధికారి ప్రజలకు అందుబాటులో ఉంటారని సీపీ శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. సమావేశంలో అదనపు సీపీలు విక్రమ్సింగ్మాన్, విశ్వప్రసాద్, జాయింట్ సీపీలు పరిమళ హనా నూతన్, గజరావు భూపాల్, డీసీపీ జోయెల్ డేవిస్ పాల్గొన్నారు.
చట్టాన్ని గౌరవిస్తేనే స్నేహం
పోలీసులు అందరితో ఫ్రెండ్లీగా ఉండటంతో ఫ్రెండ్లీ పోలీసింగ్ అవహేళనకు గురైందని సీపీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై చట్టాన్ని గౌరవించేవారితోనే స్నేహంగా ఉంటామని, వారి సహాయ సహకారాలు తీసుకుంటామని తెలిపారు. చట్టాన్ని అత్రికమించే వారితో మాత్రం కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఉద్దేశపూర్వక నేరాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో దర్యాప్తు పక్కదారి పట్టిన కేసులను బయటకు తీసి సమగ్ర విచారణ జరిపిస్తామన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే పోలీసు అధికారులను కూడా వదిలిపెట్టబోమని హెచ్చరికలు జారీ చేశారు.