హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు విస్తరించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు జనరల్ కన్సల్టెంట్ (జీసీ) నియామకం కోసం మంగళవారం ప్రీ-క్వాలిఫికేషన్ మీటింగ్ను నిర్వహించారు. బేగంపేటలోని మెట్రో రైలు భవన్లో హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 23 జాతీయ, అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ మెట్రో రైల్ ప్రాజెక్టు ప్రాధాన్యంతోపాటు నిర్ణీత సమయంలోగా పూర్తిచేయాలన్న లక్ష్యం గురించి ఎన్వీఎస్ రెడ్డి ఆయా కన్సల్టెన్సీలకు వివరించారు. హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న సీఎం కేసీఆర్ విజన్కు అనుగుణంగా ఈ ప్రాజెక్టు ఫీచర్స్ ఉండాలని సూచించారు. ఇప్పటికే మెట్రో రైల్ మొదటి దశ ప్రాజెక్టులోని ప్రత్యేకతలు, ఆ ప్రాజెక్టుకు వచ్చిన అవార్డుల గురించి వారికి వివరించారు. ఇప్పుడు రెండో దశలో నిర్మించే ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ మెట్రో రైల్ ప్రాజెక్టు మొదటి దశ ప్రాజెక్టుకు మించిన అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండాలని తెలిపారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించే ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ మెట్రో రైల్ ప్రాజెక్టులో ఎంతో అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణులు, క్షేత్ర స్థాయి ఇంజినీర్లు పెద్ద సంఖ్యలో పనిచేసేలా హెచ్ఎఎంఎల్ ప్రత్యేక బృందాలు పర్యవేక్షిస్తాయి. ఈ ప్రాజెక్టుకు సాంకేతిక, ఆర్థిక, కాంట్రాక్ట్ నిర్వహణ అధికారాలు హెచ్ఎఎంఎల్ చూస్తున్నది. అత్యుత్తమ అంతర్జాతీయ పద్ధతులు, భద్రతా ప్రమాణాలతో ఎయిర్పోర్ట్ మెట్రో ప్రాజెక్టును అమలు చేసేలా హెచ్ఎంఎల్కు జీసీ మార్గనిర్దేశం చేస్తుందని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మూడేండ్లలో ఈ ప్రాజెక్టును పూర్తిచేయాలని నిర్ణయించినందున తదనుగుణంగా జీసీ పనిచేయాలని, జీసీల బిడ్ల దాఖలుకు జనవరి 13 వరకు గడువు ఉంటుందని పేర్కొన్నారు. సమావేశంలో సీఈఈ డీవీఎస్ రాజు, సీపీఎం బీ ఆనంద్ మోహన్, సీఎస్టీఈ స్వపన్ దాస్, జీఎం ఎం విష్ణువర్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.