హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు నగారా మోగింది. అక్టోబర్ 30న ఎన్నిక నిర్వహించనున్నట్టు మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. హుజూరాబాద్ సహా దేశవ్యాప్తంగా 14 రాష్ర్టాల్లో ఖాళీగా ఉన్న మూడు పార్లమెంట్, 30 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూలును విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్లోని బద్వేల్ (ఎస్సీ) నియోజకవర్గం ఉప ఎన్నిక కూడా ఈసీ విడుదల చేసిన జాబితాలో ఉన్నది. ఈ ఉప ఎన్నికలకు అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. 8 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు 13వ తేదీ వరకు గడువు విధించారు. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అదే రోజు ఫలితాలు వెల్లడవుతాయి. 2021 జనవరి 1 వరకు సిద్ధమైన ఓటర్ల జాబితాను పరిగణనలోకి తీసుకొంటామని ఎన్నికల సంఘం తెలిపింది. కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకొనే వారికి పోలింగ్కు వారం ముందు వరకు అవకాశం కల్పించింది.
ఆన్గోయింగ్ పథకాలకు అడ్డులేదు
ఉప ఎన్నిక షెడ్యూలు విడుదలతో హుజూరాబాద్ నియోజకవర్గం విస్తరించి ఉన్న కరీంనగర్, హనుమకొండ జిల్లాల పరిధిలో ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పటికీ.. ఇప్పటికే అమలులో ఉన్న పథకాలు యథావిధిగా కొనసాగించవచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్గోయల్ తెలిపారు. ఎన్నికల షెడ్యూలు విడుదల అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఉప ఎన్నిక ప్రచారంలో, పోలింగ్ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు కొవిడ్ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని స్పష్టంచేశారు. నామినేషన్ దాఖలుచేసే సమయంలో మూడు వాహనాలకు మాత్రమే అనుమతిస్తున్నట్టు వెల్లడించారు. స్టార్ క్యాంపెయినర్ల జాబితాను కూడా కుదిస్తున్నామని చెప్పారు. జాతీయ పార్టీలకు 20, రిజిస్టర్డ్, అన్ రిజిస్టర్డ్ పార్టీలకు పది మంది స్టార్ క్యాంపెయినర్లకు అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇండోర్లో 200, ఔట్డోర్లో వెయ్యి మంది మాత్రమే ఉండేలా సభలు నిర్వహించాలని స్పష్టంచేశారు. రోడ్డు షోలు, మోటర్ బైక్ ర్యాలీలకు అనుమతి లేదని గోయల్ పేర్కొన్నారు. ఇంటింటి ప్రచారంలో ఐదుగురు మాత్రమే పాల్గొనాలని తెలిపారు. పోలింగ్కు 72 గంటలకు ముందు ప్రచారం ముగించాలని స్పష్టంచేశారు. ఎన్నికల ప్రచార వాహనంలో కూడా పార్టీల నేతలు కొవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. ఎన్నికల నిబంధనలు పాటించేలా పర్యవేక్షించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీచేశామని పేర్కొన్నారు. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీల సమక్షంలో ఈవీఎంలు పరిశీలించామని వెల్లడించారు.
ఉప ఎన్నికల ఏర్పాట్లు పూర్తి
హుజూరాబాద్ ఉప ఎన్నిక నిర్వహణకు ఏర్పాట్లు పూర్తిచేశామని సీఈవో గోయల్ ప్రకటించారు. నియోజకవర్గంలో 305 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, 610 ఈవీఎంలు రెడీగా ఉన్నాయని తెలిపారు. 47 పోలింగ్ కేంద్రాల్లో వెయ్యికంటే ఎక్కువ మంది ఓటర్లున్నారని, ఈ కేంద్రాల్లో మరిన్ని ఈవీఎంలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. నియోజకవర్గంలో 2,36,430 మంది ఓటర్లున్నారని పేర్కొన్నారు వయో వృద్ధులకు, దివ్యాంగులకు, కొవిడ్ పేషెంట్లకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటువేసే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఓటర్లందరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని స్పష్టంచేశారు. ఉప ఎన్నిక విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది అంతా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు, పాల్గొనే ఏజెంట్లు, పార్టీల నేతలు, కార్యకర్తలు కూడా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలని స్పష్టంచేశారు. నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఒక నోడల్ వైద్యాధికారిని నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు. నియోజకవర్గంలో ప్రజలందరికీ రెండు డోసుల వ్యాక్సిన్ ప్రక్రియ వేగంగా పూర్తిచేయాలని ప్రభుత్వాన్ని కోరుతామని శశాంక్ గోయల్ చెప్పారు.
త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు
హుజూరాబాద్కు ఉప ఎన్నిక నిర్వహిస్తున్నందున త్వరలోనే ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ కూడా ఉంటుందని శశాంక్గోయల్ తెలిపారు. మిగతా రాష్ట్రాల్లోనూ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగాల్సి ఉన్నందున అన్ని రాష్ట్రాలతో చర్చించి కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకొంటుందని చెప్పారు.
ఎంపీ స్థానాలు
దాద్రా నగర్ హవేలీ
హిమాచల్ ప్రదేశ్లోని మండీ
మధ్యప్రదేశ్లోని ఖాండ్వా
అస్సాం 5
పశ్చిమ బెంగాల్ 4
మధ్యప్రదేశ్ 3
హిమాచల్ప్రదేశ్ 3
మేఘాలయ 3
బీహార్ 2
కర్ణాటక 2
రాజస్థాన్ 2
తెలంగాణ 1
ఆంధ్రప్రదేశ్ 1
హర్యానా 1
మహారాష్ట్ర 1
మిజోరం 1
నాగాలాండ్ 1