హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు వాహనాల వినియోగాన్ని పెంచేలా, ఈవీ రంగానికి మరింత ఊతమిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ‘హైదరాబాద్ ఈ-మొబిలిటీ వీక్’ను ఆదివారం ప్రారంభించింది. ఈ సందర్భంగా పీపుల్స్ ప్లాజా, మియాపూర్ మెట్రోస్టేషన్ మీదుగా సుమారు 700 విద్యుత్తు వాహనాలతో హైటెక్స్ వరకు భారీ ర్యాలీ జరిగింది. పీపుల్స్ ప్లాజా వద్ద ఈవీ ర్యాలీని ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, సినీ హీరో అడివి శేష్, దర్శకుడు నాగ్ అశ్విన్, సెంట్రల్ జోన్ డీసీపీ ఎం వెంకటేశ్వర్లు జెండా ఊపి ప్రారంభించారు. మియాపూర్ మెట్రోస్టేషన్ నుంచి ర్యాలీని ఎల్అండ్టీ సీఈవో కేవీరెడ్డి ప్రారంభించారు. ఈవీ ర్యాలీలో బైక్లు, బస్సులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా జయేశ్ రంజన్ మాట్లాడుతూ.. తెలంగాణ అనుసరిస్తున్న స్నేహపూర్వక విధానాలతో ప్రధాన కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయని తెలిపారు. దేశంలోనే ఈవీ రంగంలో గమ్యస్థానంగా తెలంగాణ అవతరించబోతున్నదని వెల్లడించారు.
ఈవీలను ప్రోత్సహించాలన్న మంచి సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పాలసీని తీసుకువచ్చిందని వివరించారు. వారంపాటు నగరంలో ‘మొబిలిటి వీక్’ పేరుతో వారోత్సవాలు నిర్వహిస్తున్నామ ని తెలిపారు. పెట్రో బైక్ల స్థానంలో ఎలక్ట్రిక్ బైక్ను ఎంచుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. నగరంలో ఇప్పటికే అనేక ఈవీ షోరూమ్లు ఏర్పాటయ్యాయని, స్వయంగా ఇక్కడే తయారీ కేంద్రాలు స్థాపిస్తున్నారని వెల్లడించారు. సినీ నటుడు అడివి శేష్ మాట్లాడుతూ విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్లో ఈవీ బైకులు ప్రత్యేకతను తీసుకువస్తాయని, పర్యావరణ పరిరక్షణ కోసం నేటి యువత ఈవీ వాహనాలను ఎంచుకోవాలని సూచించారు. అనంతరం గ్రావ్టన్ మోటర్స్ కు చెందిన షెరాజ్, రాహుల్ చేసిన స్టంట్స్ షో ర్యాలీకి హైలెట్గా నిలిచింది. కాగా, సోమవారం హెచ్ఐసీసీలో మొబిలిటీ నెక్స్ హైదరాబాద్ సమ్మిట్-2023 జరగనున్నది.