హైదరాబాద్ : రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ ప్రాంతాలతో పాటు నదీ పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో నదులకు వరద పోటెత్తుతున్నది. ఇప్పటికే గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 98,275 క్యూసెక్కులు ఉండగా.. అవుట్ ఫ్లో 41వేల క్యూసెక్కులుగా ఉన్నది. దీంతో అధికారులు ప్రాజెక్టు తొమ్మిది గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. జలాశయం ప్రస్తుత నీటిమట్టం 1088.1 అడుగులు కాగా, పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు. ప్రస్తుత నీటి నిల్వ 76.743 టీఎంసీలు నీరు నిల్వ ఉండగా.. గరిష్ఠస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 90.3 టీఎంసీలు.
శ్రీరాంసాగర్ నుంచి భద్రాచలం వరకు వరద కొనసాగుతున్నది. ప్రస్తుతం నదిలో వరద ఉధృతి పెరుగుతున్నది. దీంతో అధికారులు భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. నదిలో భారీగా పెరుగుతున్న నీటిమట్టం పెరుగుతున్నది. భద్రాచలం వద్ద 52.2 అడుగులకు నీటిమట్టం పెరిగింది. 53 అడుగులు దాటితే చివరి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో దిగువన ఉన్న మండలాలకు నిలిచిన రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం వద్ద గోదావరి వరద నీటి ప్రవాహం 13,80,071 క్యూసెక్కులుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.