హైదరాబాద్: ప్రసిద్ధ చిలుకూరు బాలాజీ ఆలయంలో (Chilkur Balaji Temple) బ్రహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన నేడు గరుత్మంతునికి నైవేద్యం సమర్పించారు. అనంతరం సంతానం లేని మహిళలకు ప్రసాదంగా పంపిణీ చేశారు. ప్రసాదం కోసం తెల్లవారుజామునే భక్తులు ఆలయానికి పోటెత్తారు. పెద్ద సంఖ్యలో భక్తులు క్యూలైన్లలో బారులు తీరడంతో కిలోమీటర్లమేర ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ఆలయానికి వెళ్లేదారిలో రాకపోకలు నిలిచిపోయాయి. స్కూళ్లు, కాలేజీల బస్సులు కూడా ట్రాఫిక్లో చిక్కుకుపోయాయి. ట్రాఫిక్ను నియంత్రించలేక పోలీసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇప్పటివరకు 60 వేల మందికిపైగా భక్తులు దేవస్థానానికి వచ్చారని మొయినాబాద్ సీఐ తెలిపారు. దేవస్థానం వద్ద ప్రస్తుతం గరుడ ప్రసాదం ఇవ్వడం లేదని, ఉదయం కొద్దిసేపు ఇచ్చాక ఆపేశారని చెప్పారు. ఆలయ అధికారులు చెప్పినట్లు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. 5వేల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్పారని, అయితే దానికి పది రెట్లకు మించి వచ్చారని వెల్లడించారు. ఒకేసారి వేలమంది రావడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయని చెప్పారు. బిలుకూరి బాలాజీ దేవాలయ రోడ్లలో ప్రజలు రావద్దని కోరారు.
ఏటా శ్రీరామ నవమి తర్వాత దశమి నుంచి బాలాజీ ఆలయంలో వారం రోజుల పాటు బ్రహోత్సవాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా మొదటిరోజైన గురువారం పుట్టమన్నుతో పూజకు అర్చకులు అంకుర్పారణ చేశారు. శుక్రవారం ఉదయం ధ్వజారోహణం, శేషవాహన సేవలు నిర్వహించారు. ఈ నెల 20న స్వామివారికి గోపవాహన, హనుమాన్ వాహన సేవలు నిర్వహిస్తారు.
ఆదివారం సూర్యప్రభ వాహనం, గరుడవాన సేవలు, అదేరోజు రాత్రి 10.30 గంటలకు స్వామివారి కల్యాణోత్సం నిర్వహించనున్నారు. ఇక ఈ నెల 22న వసంతోత్సవం, గజవాహన సేవలు, 23న పల్లకి సేవ, అర్ధరాత్రి 12 గంటలకు స్వామివారి దివ్యరథోత్సవం, 24న మహాభిషేకం, ఆస్థాన సేవ, అశ్వవాహన సేవ, దోప్ సేవ, పుష్పాంజలి సేవలు నిర్వహిస్తారు. చివరి రోజైన 25న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.