Tirumala | హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి హుండీకి కాసుల వర్షం కురుస్తున్నది. జూలైలో వరుసగా 4 సోమవారాలు శ్రీవారికి రికార్డు స్థాయిలో ఆదాయం రావడం విశేషం. సోమవారం మాత్రమే హుండీ ఆదాయం రూ.5 కోట్ల మార్క్ను దాటడం గమనార్హం. జూలై 10న 64,347 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, రూ.5.11 కోట్ల ఆదాయం వచ్చింది. జూలై 17న 71,894 మంది తిరుమలను సందర్శించగా, హుండీ ఆదాయం రూ.5.40 కోట్లు సమకూరింది. జూలై 24న కూడా అదే రిపీట్ అయ్యింది. 73,796 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటే.. హుండీ ఆదాయం రూ.5 కోట్లు వచ్చింది. జూలై 31న హుండీ ఆదాయం రూ.5.21 కోట్లు రాగా, 68,601 మంది శ్రీవారి సేవలో పాల్గొన్నారు.
ఇలా గత నెల వరుసగా నాలుగు సోమవారాల్లో రూ.5 కోట్లకు మించి ఆదాయం వచ్చింది. కాగా, సోమవారం మాత్రమే రూ.5 కోట్ల హుండీ ఆదాయం రావడానికి ప్రత్యేక కారణాలు ఏమి లేవని టీటీడీ పేర్కొన్నది. శని, ఆదివారాలు ఉండే రద్దీతో హుండీలను సోమవారం లెక్కిస్తారని, దీంతో ఆదాయం పెరిగే అవకాశం ఉంటుందని చెప్తున్నది. శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన 31 దేశాలకు చెందిన 24,583 చిరిగిన కరెన్సీ నోట్లను ఆగస్టు 18,19న ఈ-వేలం వేయనున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో సంప్రదించాలని సూచించారు.