హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో మీసేవ చార్జీలు భారీగా పెరిగాయి. ఇప్పటికే అన్ని విధాలుగా ధరలు పెంచిన సర్కార్ మీసేవ చార్జీలను సైతం వదలలేదు. ఇక నుంచి మీసేవ చార్జీలను భారీగా పెంచారు. దాదాపు 100 శాతం కంటే ఎక్కువగా చార్జీలు పెంచారు. బీ క్యాటగిరీ పరిధిలోని రేషన్కార్డు, ఆదాయం, కులం, రెసిడెన్స్, కొత్త విద్యుత్ కనెక్షన్, భూభారతి కేవైసీ వంటి వాటికి ఒకేసారి రూ.80 పెంచారు. మొత్తం 15 రకాల సర్వీసులకు పెంచిన కొత్త చార్జీలు అమలవుతాయి. అలాగే పుట్టిన సర్టిఫికెట్ ప్రింట్, ఈసీ వంటి సర్వీసులకు రూ.62 పెంచారు.
వీటి పరిధిలోకి మరికొన్ని సర్వీసులను వర్తింపజేస్తున్నారు. ప్రతి పేజీ స్కానింగ్ కోసం రూ.2.50 అదనంగా వసూలు చేయనున్నట్టు తెలిపారు. పెంచిన ఈసేవ కొత్త చార్జీలు ఈ నెల 1 నుంచే (బుధవారం) నుంచి అమల్లోకి వచ్చినట్టు తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల్లో తెలిపారు. ఇప్పటి వరకు ఈసేవ కనీస చార్జీ రూ.35 వసూలు చేసేవారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల నడ్డి విరవడానికే చివరాఖరుకు మీసేవ చార్జీల పెంపును కూడా వదిలిపెట్టలేదు అని వినియోగదారులు మండిపడుతున్నారు.