హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలు (Guru Purnima) ఘనంగా జరుగుతున్నాయి. సాయిబాబా ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు క్యూకట్టారు. సాయిబాబాను దర్శించుకుని పూజాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్ సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి వేడుకలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. భక్తులు పెద్దసంఖ్యలో సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
గురువుకు సమాజంలో అత్యత్తమ స్థానం ఇవ్వడం సంప్రదాయంలో భాగంగా వస్తున్నది. గురువును బ్రహ్మ, విష్ణు, మహేశ్వరునిగా పూజించడమనేది ఆనవాయితీ. అజ్ఞానం అనే అంధకారాన్ని పోగొట్టి విజ్ఞాన జ్యోతులు వెలిగించే వ్యక్తే గురువు. విద్యాబుద్ధులు నేర్పి వికాసం వైపు నడింపే మహోన్నత వ్యక్తి గురువు. ఆషాఢమాసంలో వచ్చే పౌర్ణమిని గురుపౌర్ణమిగా నిర్వహించడం ఆచారం. వేదాలు రచించిన వ్యాసుడు జన్మించిన రోజుగా ప్రజల నమ్మకం. జగతిని జాగృతపరిచిన గురుదేవులను నేడు పూజించడం ఆనవాయితీ.
ఇక గురుపౌర్ణమి సందర్భంగా ఆలయాల్లో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. హనుమకొండలోని బాలసముద్రం సాయిబాబా గుడిలో భక్తులు బారులుతీరారు. ఖమ్మంలో బాబా ఆలయంలో గురుపౌర్ణమి సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదిలాబాద్, మహబూబ్నగర్లోని అమిస్తాపూర్ సాయిబాబా గుడిలో, కరీంనగర్, నిజామాబాద్, సంగారెడ్డి, నల్లగొండలోని సాయిబాబా ఆలయాల్లో గురుపౌర్ణమి శోభ నెలకొన్నది.