యాదాద్రి, నవంబర్ 20 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం భక్తజనసందోహంగా మారింది. మాడవీధులన్నీ కిక్కిరిసిపోయాయి. కార్తిక మాసం చివరి ఆదివారం ఇలవేల్పును దర్శించుకొనేందుకు వేలాదిమంది భక్తు లు ఆలయానికి చేరుకొన్నారు. క్యూలైన్లలో గంటలకొద్దీ నిల్చొని స్వామివారిని దర్శంచుకొన్నారు. ధర్మ దర్శనానికి దాదాపు 4 గంటలు, ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. స్వామివారిని సుమారు 80 వేల మంది భక్తులు దర్శించుకొన్నట్టు ఆలయ అధికారులు అంచనా వేశారు.
రికార్డుస్థాయి ఆదాయం
రెండు వారాలుగా ఆలయ నిత్యాదాయం రికార్డు స్థాయిలో నమోదవుతున్నది. ఆదివారం ఒక్కరోజే స్వామివారి హుండీకి రూ. 1,16,13,977 ఆదా యం సమకూరినట్టు ఆలయ ఈవో ఎన్ గీత తెలిపారు. ఇందులో అత్యధికంగా ప్రసాద విక్రయాల ద్వారా రూ.44,37, 150, వీఐపీ దర్శనాలతో రూ.18,90, 000, కొండపైకి వాహనాల ప్రవేశంతో రూ.9,75,000, సత్యనారాయణ వ్రతాల ద్వారా రూ.15,20,000, బ్రేక్ దర్శనాలతో రూ.9,75,000 ఆదాయం వచ్చినట్టు వివరించారు.