హైదరాబాద్ : రోజు రోజుకు రాష్ట్రంలో విద్యుత్ గరిష్ఠ డిమాండ్ పెరుగుతున్నది. గత నాలుగు రోజుల్లోనే మూడుసార్లు గరిష్ఠ డిమాండ్ పెరిగి.. గత రికార్డులు బద్దలయ్యాయి. తాజాగా మంగళవారం మధ్యాహ్నం 12.28 నిమిషాలకు 14,160 మెగావాట్ల గరిష్ఠ విద్యుత్ డిమాండ్ నమోదైంది. దీంతో గడిచిన నాలుగు రోజుల్లోనే రికార్డు బ్రేక్ కావడం ఇది మూడోసారి. రాష్ట్రంలో వ్యవసాయం, ఉష్ణోగ్రతలు పెరగడం, తాగు, సాగునీటి కోసం ఎత్తిపోతల పథకాలను నడపడంతో భారీగా డిమాండ్ ఏర్పడిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
నిజానికి ఈ నెల 26న 13,742 మెగావాట్లు డిమాండ్ నమోదైంది. దీంతో 2021 మార్చి 26 నాడు నమోదైన 13,688 మెగావాట్ల రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. ఆ రికార్డు సైతం రెండు రోజుల్లోనే బ్రేక్ అయ్యింది. ఈ నెల 28న సాయంత్రం 3.54 గంటలకు 13,857 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ నమోదైంది. ఆ వెంటనే మంగళవారం నాడు ఏకంగా 14వేల మెగావాట్ల మైలురాయిని దాటి.. 14,160 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ నమోదైంది. దీంతో ఈ నెలలోనే మూడు సార్లు రికార్డు బ్రేక్ అయ్యిందని, అయితే మూణ్నాలుగు రోజుల్లో ఈ రికార్డు కూడా దాటే అవకాశం ఉందని విద్యుత్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 14,160 మెగావాట్లే అత్యధిక విద్యుత్ డిమాండ్. నిజానికి ఉమ్మడి రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో డిమాండ్ రాలేదు. ఉమ్మడి రాష్ట్రంలో గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 13,162 మెగావాట్లు మాత్రమే. ఈ రికార్డును గతేడాదే తెలంగాణ దాటేసింది. తాజాగా మంగళవారం నమోదైన గరిష్ఠ డిమాండ్తో.. దక్షిణ భారతంలోనే అత్యధిక విద్యుత్ వినియోగం ఉన్న రెండో రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. మొదటి స్థానంలో తమిళనాడు ఉంది. రాబోయే రోజుల్లో మరింతగా డిమాండ్ పెరిగే అవకాశ ఉన్న నేపథ్యంలో.. ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు మాట్లాడుతూ.. 17,500 మెగావాట్ల వరకు వ్యవస్థలను బలోపేతం చేశామన్నారు.
అప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని, ప్రజలకు నాణ్యమైన విద్యుత్ను 24 గంటలపాటు నిరంతరాయంగా అందించేందుకు కంకణబద్ధులమై ఉన్నట్టు తెలిపారు. అయితే విద్యుత్ వృథా చేయకుండా ప్రజలు చైతన్యంతో మెలగాలన్నారు. వృథా చేయకుండా పొదుపుచేసిన ఒక్క యూనిట్ విద్యుత్తు అయినా.. ఉత్పత్తి చేసినట్టేనని సీఎండీ పేర్కొన్నారు.