హైదరాబాద్: అగ్రి స్టార్టప్లకు ఇకముందు భారీ డిమాండ్ ఉంటుందని నాబార్డు చైర్మన్ గోవిందరాజులు అన్నారు. దేశంలో ఇది ఏడో అగ్రి ఇన్నోవేటివ్ హబ్ అని చెప్పారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కొత్తగా ఏర్పాటుచేసిన అగ్రి హబ్ను నాబార్డు చైర్మన్ గోవిందరాజులుతో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గోవిందరాజులు మాట్లాడుతూ.. భవిష్యత్లో మాంసాహారం తినే అవసరం ఉండదని చెప్పారు. పప్పు ధాన్యాలు, సోయాబీన్తోనే మాంసాహార ఉత్పత్తులు వస్తాయన్నారు. ఐటీతో జెనెటిక్స్, బీటీ టెక్నాలజీని అనుసంధానించాలని సూచించారు.
ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా మన దేశ జీడీపీలో 15.5 శాతం వ్యవసాయ రంగానిదేనని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగానికి ప్రాధాన్యమిస్తున్నారని తెలిపారు. పరిశోధన, అభివృద్ధి మీద మన దేశం ఖర్చు పెట్టేది చాలా తక్కువ అని వెల్లడించారు.