హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): పేదలకు సబ్సిడీపై నిత్యావసర సరుకులను అందించే ప్రజా పంపిణీ వ్యవస్థకు కేంద్రం ఎసరు పెడుతుందా?.. అనే అనుమానాలు బలపరిచేలా కేంద్ర బడ్టెట్ కేటాయింపులున్నాయి. ఆహార సబ్సిడీకి కేటాయించే నిధులకు ఈ వార్షిక బడ్జెట్ 2022-23లో భారీగా కోత పడింది. ఇది గత వార్షిక బడ్జెట్ 2021-22లో కేటాయించిన దాని కంటే రూ.96,917 కోట్లు తక్కువ కావడం గమనార్హం. 2021-22 ఆహార సబ్సిడీ రూ.2,42,836 కోట్లుండగా, ఈసారి రూ.1,45,919 కోట్లు మాత్రమే దక్కాయి. దీంతో పేదలు, రైతాంగానికి ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం ఆహార సబ్సిడీపై భారీగా కోత పెట్టడం వల్ల వ్యవసాయం రంగం కుదేలయ్యే ప్రమాదంలో కూడా పడింది. పేద ప్రజలకు, రైతన్నకు వెన్నుదన్నుగా నిలవాల్సిన కేంద్ర ప్రభుత్వమే ఈ వర్గాల ఉసురు తీసేలా బడ్జెట్ కూర్పు జరిగిందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. మొత్తానికి నిత్యావసర సరుకులు, ఎరువులపై ఇచ్చే సబ్సిడీలను కేంద్ర ప్రభుత్వం ఒక పథకం ప్రకారం తగ్గిస్తున్నదా? అనే అనుమానాలకు తావిస్తున్నది.
ఎరువుల సబ్సిడీపైనా..
బడ్జెట్తో మేలు జరుగుతుందని ఆశపడ్డ రైతుపై కేంద్రం ధరల పిడుగును వేసింది. ఎరువులపై సబ్సిడీకి కేటాయించే బడ్జెట్లో భారీ కోత పెట్టింది. బడ్జెట్లో ఎరువుల సబ్సిడీకి రూ.1.05 లక్షల కోట్లను కేటాయించింది. సవరించిన అంచనాల ప్రకారం గతేడాది రూ.1.40 లక్షల కోట్లను కేటాయించింది. దీంతో ఈ బడ్జెట్లో సుమారు రూ.35వేల కోట్లు తగ్గినైట్టెంది. ఇందులో యూరియా సబ్సిడీలో రూ.12,708 కోట్లు తగ్గించగా, ఇతర ఎరువుల సబ్సిడీలో రూ.22,192 కోట్లను తగ్గించింది.