యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహస్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. కార్తీకమాసం చివరి ఆదివారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు యాదాద్రికి చేరుకుని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదాద్రీశుని దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు క్యూలైన్లలో వేచిఉన్నారు. దీంతో ఉచిత దర్శనానికి నాలుగు గంటలు, వీఐపీ టికెట్ దర్శనానికి రెండు గంటల సమయం పడుతున్నది.
స్వామివారి నిత్య పూజోత్సవాలు తెల్లవారుజామున 4 గంటల నుంచి మొదలయ్యాయి. స్వామి, అమ్మవార్లను పట్టు, వివిధ రకాల పూలతో అలంకరించి అభిషేకం చేశారు. కొండ కింద పాత గోశాల వ్రత మండపం, పాత గుట్ట వ్రత మండపాల వద్ద సత్యనారాయణ స్వామి వ్రతల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వ్రత మాచరిస్తున్నారు.