హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పీఆర్సీపై భారీ ఆశలుపెట్టుకున్నారు. రెండో పీఆర్సీలో వేతనాలు గణనీయంగా పెంచాలని కోరుతున్నారు. 40% ఫిట్మెంట్ ఇవ్వాలని, హెచ్ఆర్ఏను గరిష్ఠంగా 28 శాతానికి పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఉద్యోగుల వేతన సవరణపై అధ్యయనానికి గత కేసీఆర్ ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శివశంకర్ నేతృత్వంలో పీఆర్సీ కమిటీని నియమించగా.. ఆ కమిటీ ప్రస్తుతం సంఘాల నుంచి ప్రతిపాదనలు స్వీకరిస్తున్నది. సోమవారం తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం (టీఎన్జీవో), తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో),పీఆర్టీయూ టీఎస్, టీఎస్ యూటీఎఫ్, టీఎస్జీహెచ్ఎం అసోసియేషన్లు, పెన్షనర్ల జేఏసీ పీఆర్సీ కమిటీకి ప్రతిపాదనలు సమర్పించాయి. ఫిట్మెంట్ను సిఫారసు చేసేందుకు కేరళ, కర్ణాటక రాష్ర్టాల వేతనాలు, దక్షిణాది రాష్ర్టాల వినియోగదారుల సూచీ, ద్రవ్యోల్బణం అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరాయి. టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్, అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకట్, సత్యనారాయణగౌడ్, కోశాధికారి రామినేని శ్రీనివాస్రావు, ముజీబ్హుస్సేని, టీజీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏలూరి శ్రీనివాస్రావు, సత్యనారాయణ, పీఆర్టీయూ నుంచి ఎమ్మెల్సీ రఘోత్తమ్రెడ్డి, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్రెడ్డి, బీరెల్లి కమలాకర్రావు తదితరులు పీఆర్సీ కమిటీ చైర్మన్ శివశంకర్ను వేర్వేరుగా కలిసి ప్రతిపాదనలిచ్చారు.
ఉద్యోగులు, టీచర్ల కనిష్ఠ వేతనం రూ.35 వేలుగా నిర్ణయించి 50% ఫిట్మెంట్తో పీఆర్సీని అమలుచేయాలని పీఆర్టీయూ టీఎస్ కోరింది. ఈ మేరకు మాజీ ఎమ్మెల్సీలు పూల రవీందర్, బీ మోహన్రెడ్డి, సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి గుర్రం చెన్నకేశవరెడ్డి, వెంకట్రెడ్డి, ప్రసాద్, వేమిరెడ్డి దిలీప్రెడ్డి తదితరులు నివేదికలు పీఆర్సీ కమిటీకి నివేదిక సమర్పించారు. పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు పర్వత్రెడ్డి, సదానంద్గౌడ్ (ఎస్టీయూ), జంగయ్య, చావ రవి, (టీఎస్యూటీఎఫ్), రాజభాను చంద్రప్రకాశ్, రాజుగంగారెడ్డి (టీఎస్జీహెచ్ఎంఏ), నర్సిహుంలు, జగదీశ్ (ఆర్యూపీపీ), కృష్ణుడు (బీసీటీఏ), ఎస్ రామదాసు, ఇర్ఫాన్ (ఎస్జీటీఎఫ్), అశోక్కుమార్, కటకం రమేశ్ (టీఆర్టీఎఫ్), భిక్షంగౌడ్, చెన్నయ్య (పీఆర్టీయూ తెలంగాణ) తదితరులు పలు అంశాలపై నివేదికలను సమర్పించారు.
కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంను రద్దుచేసి పాత పెన్షన్ విధానం అమలుచేయాలని సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు గంగాపురం స్థితప్రజ్ఞ, కల్వల్ శ్రీకాంత్ కోరారు. కేస్స్టడీస్తో కూడిన 20 పేజీల నివేదికను సమర్పించారు.
గ్రామ పంచాయతీ కార్యదర్శుల వేతనాలను 40% పెంచేలా సిఫారసు చేయాలని పీఆర్సీ కమిటీ చైర్మన్ శివశంకర్ను తెలంగాణ పంచాయతీ సెక్రటరీస్ అసోసియేషన్ అధ్యక్షుడు పీ మధుసూదన్రెడ్డి కోరారు.