Bakka Judson | హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేసి, సోనియా, రాహుల్ గాంధీని ఇబ్బందిపెట్టిన ప్రధాని మోదీ సీఎం రేవంత్రెడ్డికి బడేభాయ్ ఎట్ల అయితడు? అని కాంగ్రెస్ సీనియర్ నేత, ఏఐసీసీ మాజీ సభ్యుడు బక్క జడ్సన్ ప్రశ్నించారు. దీనిని బట్టి షోకాజ్ నోటిసు ఇవ్వాల్సింది ఎవరికో క్రమశిక్షణ కమిటీ ఆలోచించాలని అన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న అభియోగంపై షోకాజ్ నోటిసు అందుకున్న బక్క జడ్సన్ ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధితో తన ఆవేదన పంచకున్నారు. ప్రధాని మోదీని బడేభాయ్ అని పొగడటం కాకుండా.. విభజన హామీలను ఎందుకు నెరవేర్చలేదు, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కాజీజిపేట కోచ్ ఫ్యాక్టరీ ఏమయ్యాయి? తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదని సీఎం రేవంత్రెడ్డి నిలదీసి ఉంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మేవారని అన్నారు. అలా కాకుండా తెలంగాణకు మొండి చేయి చూపిన మోదీని బడేభాయ్ అని అంటే ఎవరికి లాభం బీజేపీకా? కాంగ్రెస్కా? అని నిలదీశారు.
తెలంగాణ ప్రజలు గత ప్రభుత్వాన్ని గద్దె దింపి, కాంగ్రెస్ పార్టీకి పట్టం కడితే, గత ప్రభుత్వంలో అధికారం చెలాయించిన వారిని కాంగ్రెస్లో ఎలా చేర్చుకుంటారని ఒక సగటు కార్యకర్తగా ప్రశ్నించడం తప్పా అని జడ్సన్ ఆవేదన వ్యక్తంచేశారు. తనపై ఫిర్యాదు చేసింది ఎవరో నోటీస్లో వారి పేర్లు ఎందుకు రాయలేదని ప్రశ్నించారు. గత 34 ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న నిఖార్సైన కార్యకర్తనని, ఏఐసీసీ సభ్యునిగా, జార్ఖండ్ రాష్ట్ర ఇన్చార్జిగా, ఏపీసీసీ ప్రధాన కార్యదర్శిగా కీలక పదవులు నిర్వహించానని గుర్తు చేశారు. రేవంత్రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత పార్టీలో తనకున్న పదవులన్నింటి నుంచి తొలగించారని ఆరోపించారు. కాంగ్రెస్ సిద్ధాంతానికి పూర్తి విరుద్దమైన సిద్ధాంతం కలిగిన బీజేపీ నాయకులను రేవంత్రెడ్డి పార్టీలో చేర్చుకోవడం తప్పు అయితదా? లేక తాను మాట్లాడింది తప్పు అయితదా? అని నిలదీశారు.
గతంలో కాంగ్రెస్ను తిట్టిన వారికి, పార్టీ అభ్యర్థులను ఓడించిన వారికి ఎంపీ టికెట్లు ఇస్తున్నారని బక్క జడ్సన్ ఆరోపించారు. చామల కిరణ్కుమార్రెడ్డి ఒక హిందీ టీవీ చానల్ చర్చలో రాహుల్గాంధీని నోటికొచ్చినట్టు తిట్టాడని, అతనికి భువనగిరి టికెట్ ఇచ్చారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి, పటాన్చెరు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఓటిమికి కారణమైన నీలం మధుకు మెదక్ టికెట్ ఇచ్చారని చెప్పారు. దీని ద్వారా పార్టీ శ్రేణులకు ఏం సందేశం ఇస్తున్నామని జడ్సన్ ప్రశ్నించారు. చేవెళ్ల, మల్కాజిగిరి, భువనగిరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థులుగా ఎంపిక చేసిన వారిని చూస్తే, అక్కడ బీజేపీ అభ్యర్థులను గెలిపించే కుట్ర జరుగుతున్నదా? అన్న అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు.
సీఎం రేవంత్రెడ్డి పక్కన ఉన్నోళ్లే ఫోన్ ట్యాపింగ్కు పాల్పడుతున్నారని బక్క జడ్సన్ ఆరోపించారు. నాలుగు లక్షల సిమ్ కార్డుల కొనుగోళ్ల వెనుక సీఎం రేవంత్రెడ్డి ఓఎస్డీ చంద్రశేఖర్రెడ్డి ఉన్నారని చెప్పారు. విద్యాసాగర్రెడ్డి అనే వ్యక్తి నాలుగు లక్షల సిమ్ కార్డులు కొన్నారని నగర సీపీకి ఫిర్యాదు చేయగానే, షోకాజ్ నోటీసు ఇచ్చారని ఆరోపించారు. ఇది ఎక్కడ తలకు చుట్టుకుంటుందోనన్న భయంతోనే సీఎం తనకు షోకాజ్ నోటీసు ఇప్పించారని జడ్సన్ విమర్శించారు.