Telangana | సిరులు పండించే చేవ ఉన్నా.. అప్పుడు కరెంటు ఎక్కడిది? దుక్కులు దున్ని సిద్ధంగా ఉన్నా.. నీళ్లు ఇచ్చిన నాథుడేడి? నోరెళ్లబెట్టిన బోర్లు.. నెర్రెలు వారిన పొలాలు… పదెకరాల ఆసామి పూల్యా నాయక్ను కలవరపెట్టాయి. అయినవారిని కాదనుకునేలా చేశాయి. కన్నఊరిని వదిలి దేశం బాట పట్టేలా నెట్టేశాయి. ఎనిమిదేండ్లు అష్టకష్టాలు పడేలా చేశాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్ప బలం.. వచ్చిన తెలంగాణను గెలిపించింది. అనంత జలసిరిని బీడు భూములకు మళ్లించింది. మాగాణాన్ని మురిపించింది. దేశం కాని దేశంలో కూలీగా బతికిన పూల్యా నాయక్ను సొంతూళ్లో స్థిరపడేలా చేసింది. ఎవుసంలో రారాజుగా నిలిపింది. ఉమ్మడి రాష్ట్రంలో కరువు పరిస్థితులకు తల్లడిల్లిన ఈ రైతు పొలం.. స్వరాష్ట్రంలో పంటసిరులతో తుళ్లిపడుతున్నది. కేసీఆర్ వల్లే తన తలరాత మారిందని చెబుతున్న పూల్యా నాయక్ ‘నమస్తే తెలంగాణ’తో పంచుకున్న జీవిత అనుభవాలు ఆయన మాటల్లోనే..
నా జీవితం తెలంగాణకు ముందు, తెలంగాణకు తర్వాత అని చెప్త. ఇయ్యాల నేను బాజాప్తా కష్టం చేసుకొని బతుకుతున్న. దానికి తగ్గ లాభం పొందుతున్న. మాది వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం చిన్నమందడి పంచాయతీ పరిధిలోని ధన్సింగ్ తండా! ఉమ్మడి కుటుంబానికి 30 ఎకరాల పొలం ఉంటుండే. అన్నదమ్ములం ఆస్తులు పంచుకుంటే.. నా వాటా కింద పది ఎకరాలొచ్చింది. గిప్పుడు పదెకరాలంటే కరోడ్పతి! అప్పుడేం ఉంటుండే.. భూమి ఎంతుంటే అంత ఎక్కువ అప్పులు అయితుండే! అప్పులు కట్టలేక.. పొలం అమ్ముకున్నోళ్లు ఎంతమందో! నా కిస్మత్ బాగుందేమో పొలం అమ్మలే!!
అప్పట్ల ఎవుసం తప్ప చేసేందుకు మరో పని ఉండకపోవు. ఎంత కష్టం చేసినా ఎన్నడూ కాలం సక్కగ ఉండకపోవు! అదును చూసి వానలు పడకపోతుండే! పూడుకుపోయిన చెరువులల్ల నీళ్లుంటే ఒట్టు. గట్టి వాన పడితే.. కట్ట కొట్టుకుపోతుండే. వానలు పడకపోతే ఏడాదంతా ఎండిపోయి ఉంటుండే! ఎండకాలమొస్తే ఇగ కరువే! పొలమంతా ఎడారిలా ఉంటుండే!! కండ్లముందే ఎండిపోతున్న పంటలను చూసి దుఃఖం ఆగకపోయేది. నీళ్లు లేక సచ్చిపోతున్న పైరును కాపాడుకోవాలని లెక్కలేనన్ని బోర్లు వేసినం. వందల ఫీట్లు కొట్టిస్తుంటి. జరన్ని నీళ్లు పడ్డా మురిసిపోతుంటి. రెండు నెలలు తిరక్కముందే అవి ఎండిపోతుండే. పంటకో బోరు వేసి అప్పుల పాలైన. పది ఎకరాల్లో 20 బోర్ల దాకా ఏసిన. అప్పట్లనే లక్షలు ఖర్చుపెట్టిన.
నేననే కాదు.. మా సుట్టుపక్కల రైతుల గోస కూడా గింతనే ఉంటుండే! కిస్మత్ ఖులాయించి బోర్ల నీళ్లుంటే.. ఈ కరెంటు అరిగోస పుచ్చుకుంటుండే. గా కరెంటు కష్టాల గురించి ఎంత చెప్పినా తక్వనే! ఎప్పుడొస్తదో.. ఎప్పుడు పోతదో తెల్వకపోతుండే. మోటర్ చాల్ అయినంక గంట నడిస్తె గొప్ప. రెండు మడులు నీళ్లు పెట్టినమో లేదో.. కరెంటు పోతుండే. మల్లా ఏ రాత్రికో వస్తుండే.. పారిన మడే పారుతుండే! గిదేం బతుకురా అనుకోని దినం లేదు. చేసిన కష్టమంతా నేలపాలు అయితుండే! ఎండిపోయిన పొలాల్లోకి బర్లు, మేకలను మేతకు తోలుతుంటి. అప్పుడు కండ్లపొంటి రక్తమొచ్చినట్టు అయితుండే. చేతికి రాని పంట గురించి ఏం ఆలోచిస్తం. మా గాచారం గింతేనని పశువులను పొలంలో ఇడ్సిపెట్టేది. ఆ రోజుల్ల గోజలు గిన నరకం అనుభవించినయి. చెరువులు, కుంటల్లో పశువులకు తాగనీకి నీళ్లు కూడా ఉండకపోతుండే. మా కష్టం చెప్తే రామాయణమంత! తిండి పుట్టుడే కష్టమైతుండే. గంజి తాగి ఆకలిని చంపుకొన్న రోజులున్నయి. అవీ లేకపోతే నేను పస్తుండేటోడ్ని! ఇంకా ఎన్ని దినాలు గివన్ని భరిస్తం. నేను పస్తున్నా.. నా భార్య, ముగ్గురు కూతుళ్లు, కొడుకును సక్కగ చూసుకోవాలి గదా! అందుకే, ఇగ ఎవుసం నడవదని సౌదీకి పోయిన. 2002లో దేశం దారి పట్టిన. ఎనిమిదేండ్లు అక్కడ గొడ్డు చాకిరి చేసిన. పదెకరాలున్నా గిదేం బతుకని బాధపడని దినం లేదు. 2010లో మళ్లీ ఊరికొచ్చిన. నేను మల్లొచ్చేసరికీ గవే పరిస్థితులు! అభిమానం సంపుకొని మళ్లీ దేశం పోబుద్ధి కాలే! ఎంతో కొంత ఎనకేసుకున్న. అయ్యేదేదో అయితదని ఈడనే ఉండాలనుకున్న. నాలుగేండ్లు తిప్పలు పడ్డా. తెలంగాణ వచ్చినాంక.. మెల్లగ ఊరు తెల్లవడ్డది. కేసీఆర్ సారు పట్టుబట్టి నీళ్ల సౌలత్ చేసుడుతోని రంది పోయింది. పెట్టుబడి సాయం అందుతున్నది. కాలం గూడా మంచిగైతున్నది. తెలంగాణ వచ్చిన రెండేండ్లకే నా పొలం పచ్చవడ్డది.
గతంల బతుకుదెరువు కోసం సౌదీకి పోయిన నేను… తెలంగాణ అచ్చినంక ఈ పదేండ్లు తండాను ఇడిసిపెట్టి పోలే. ఈడనే ఉంటున్న. కేసీఆర్ పాలనలో నీళ్ల గోస తీరింది. కల్వకుర్తి అయిపోవుడుతోని మా కష్టాలు పోయినయి. బుద్ధారం కాల్వ నుంచి గార్లకుంటకు నీళ్లొచ్చినయి. మా తండాతోపాటు చుట్టుపక్కల పొలాలూ సాగులోకి వచ్చినయి. బోర్లు ఆగకుంట నీళ్లుపోస్తున్నయి. నా పొలంల ఉన్న బోర్లు ప్రాణం పోసుకున్నయి. నాలుగు బోర్ల నీళ్లతో పదెకరాలు పండిస్తున్న. ఐదు ఎకరాలల్ల వరి ఏస్తున్న. మామిడి తోట కూడా పెట్టిన. టమాట, మిర్చి, కూరగాయలు అంతరపంటలు పండిస్తున్న. ఒక ఎకరంలో బర్ల షెడ్డు, ఇల్లు కట్టుకున్న. ఎవుసంతో పాటే 30 బర్లను సాదుతున్న. ఈ సీజన్లో 500 బాక్సుల టమాట అమ్మిన. ఇంకా వెయ్యి బాక్సుల టమాట ఎల్తది. దినాం 40 లీటర్ల పాలు పోస్తున్న. పొద్దంతా పనిలనే ఉంటున్న. నాలుగు పైసలు కండ్ల చూస్తున్న. కాంగ్రెసోళ్లు ఉన్నప్పుడు దండుగ అనుకున్న ఎవుసం కేసీఆర్ దయతోని పండుగైంది. గిప్పుడు కరెంటు పోవుడు ముచ్చట లేదు. పొద్దంత, రాత్రంత ఉంటున్నది. ఎప్పుడంటే అప్పుడు నీళ్లు పారించుకునే సౌలత్ చేసిన కేసీఆర్ సారు రుణం తీర్చుకోలేం. నా ఒక్క పొలమే కాదు.. చుట్టుపక్కల ఎక్కడ చూసినా పచ్చటి పొలాలే కనిపిస్తున్నయి. ముఖ్యమంత్రి పట్టుదలతోనే గిదంత సాధ్యమైంది. నా కష్టాలన్నీ తీరినయి. చేతినిండా పనితో, గుండెనిండా సంతోషంతో హాయిగా బతుకుతున్న. నా తలరాత మార్చిన కేసీఆర్ సారు ఎంబటే నా కుటుంబం ఉంటది. మా రైతన్నల నసీబు మారిందంటే ఆయన చలువ వల్లనే!! మేమంతా ఆయనతోనే ఉంటం. కేసీఆర్ను మళ్లీ గెలిపించుకుంటం.
తెలంగాణ వచ్చినంక అన్ని సమస్యలు తీరినయి. సొంతూరులోనే సేద్యం చేసుకుంటూ కుటుంబంతో హాయిగా ఉంటున్న. గిప్పుడు 24 గంటల కరెంటు వస్తున్నది. మా ఇద్దరు బిడ్డలకు పెండ్లిండ్లు అయినయి. వాళ్లకు కల్యాణలక్ష్మి వచ్చింది. ఇంకో ఇద్దరు సర్కారు బడిలనే చదువుతున్నరు. నాబార్డ్ నుంచి ట్రాక్టర్ తీసుకుంటే మూడున్నర లక్షల సబ్సిడీ వచ్చింది. రైతుబంధు ఏడాదికి లక్ష రూపాయలు వస్తున్నయి. సీఎం కేసీఆర్ సారుకు చేతులెత్తి దండం పెట్టాలె.
…? వంగూరు నరసింహారెడ్డి