Sarala Kumari | “సరళకుమారి గారూ తిన్నారా? ఎలా ఉన్నారు? ఆరోగ్యం బాగుందా?’ ఇలా ప్రతిరోజూ ఎవరో ఒకరు వచ్చి, పేరు పెట్టి పిలిచి మరీ మా బాగోగులు తెలుసుకునేవారు. అడగకముందే.. ‘ఇంకా ఏమైనా కావాలా’ అంటూ ఆర్మీ స్టాఫ్ అభిమానం కురిపించేవారు. ఏదో అదృశ్యశక్తి మాకు సాయం అందించింది” అంటూ సిక్కిం వరదల సమయంలో సైన్యం నుంచి అందిన సాయాన్ని వివరిస్తారు నటి, నృత్యకారిణి సరళకుమారి. ఆ అదృశ్య శ్రేయోభిలాషి సాక్షాత్తు తెలంగాణ ప్రభుత్వమే అని ఆ తర్వాత ఆమెకు అర్థమైంది.
కళ్లముందే ఊహించని విపత్తు. జనం వరదల్లో కొట్టుకుపోతున్నారు. సాయం కోసం అర్థిస్తున్నారు, ఆక్రందనలు చేస్తున్నారు. టూరిస్టుల ప్రాణాలు కాపాడేందుకు ప్రకృతి వికృత స్వరూపానికి తట్టుకుని మరీ.. సహాయక చర్యలు చేపడుతున్నారు సైనికులు. ఇదీ.. ఇటీవల సిక్కిం జలప్రళయ మరణ మృదంగం. ఈ విపత్తు నుంచి ప్రాణాలతో బయటపడ్డారు నటి, కూచిపూడి నృత్యకారిణి సరళకుమారి. కానీ, అక్కడినుంచి క్షేమంగా ఇంటికి చేరుకోవడం ఎలా అన్నది అతిపెద్ద ప్రశ్న. అప్పటికే నెట్వర్క్ మొత్తం ధ్వంసమైంది. సెల్ఫోన్ సిగ్నల్స్ లేవు. ఆ సమయానికి తెలంగాణ పౌరులెవరూ సిక్కింలో లేరనే ప్రాథమిక సమాచారంతో రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు కూడా ఊపిరి పీల్చుకున్నాయి. అంతలోనే, సరళకుమారి కూతురు నబిత ఓ వీడియో సందేశం విడుదల చేశారు. తన తల్లి, ఆమె స్నేహితులు సిక్కింలోని ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించడానికి వెళ్లి, వరదల్లో చిక్కుకున్నారని, వారి ప్రాణాలను కాపాడాలంటూ అందులో తెలంగాణ ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. దీంతో ఉన్నతాధికారులు అప్రమత్తయ్యారు. అప్పటికే కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ ఆమె వరదల్లో చనిపోయారని, పరిశ్రమ నివాళులు అర్పించిందనీ వార్తలు వండి వార్చాయి. ఆ గాలి కబుర్లు ఆధారంగా కొన్ని పత్రికలు డెత్ సర్టిఫికెట్ కూడా ఇచ్చేశాయి. దీంతో సరళకుమారి ఒక్కగానొక్క కూతురు.. భయపడిపోయింది. కన్నతల్లిని కడసారి చూసే అవకాశమైనా కల్పించాలని వేడుకొంది.
శాటిలైట్ కాల్..
ఆ క్షణం భారత్ నుంచి వచ్చిన ఓ శాటిలైట్ కాల్ నబిత ఆశలకు జీవం పోసింది. ‘బిడ్డా.. నేను లాచెన్లో క్షేమంగానే ఉన్నాను. ఇక్కడొక హోటల్లో తలదాచుకున్నాం. ఇది కూడా మునిగిపోతుందని, భూకంపం వచ్చే సూచనలు ఉన్నాయని అంటున్నారు. ఈ ప్రదేశాన్ని త్వరలో ఖాళీ చేస్తున్నాం’ అనే సమాధానంతో నబిత మనసు కొంత స్థిమిత పడింది. వెంటనే, తనకు తెలిసిన అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి రంగంలోకి దిగారు. ఢిల్లీ తెలంగాణ భవన్ రెసిడెంట్ ఆఫీసర్ గౌరవ్ ఉప్పల్ను అప్రమత్తం చేశారు. సిక్కిం సీఎస్తో సంప్రదింపులు జరిపారు.
ఆర్మీ అధికారులకు వివరాలు అందించారు. సిక్కిం డీజీపీ ఏకే సింగ్తో హైదరాబాద్ నగర మాజీ సీపీ సీవీ ఆనంద్కు పూర్వ పరిచయం ఉండటంతో.. ఆయన సింగ్కు పరిస్థితిని వివరించారు. తెలంగాణ నుంచి వెళ్లి.. వరదల సమయంలో తప్పిపోయిన వారి జాబితాను ఆర్మీ అధికారులకు పంపారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సరళకుమారి మిత్ర బృందం ఆనవాళ్లను కనిపెట్టారు సైనికాధికారులు. సాక్షాత్తు ప్రభుత్వ పెద్దలే ప్రత్యేక శ్రద్ధ కనబరచడంతో వారికి అడుగుడుగునా వీఐపీ ఆతిథ్యం లభించింది. సమయానికి అన్నీ సమకూర్చారు, యోగక్షేమాలు తెలుసుకున్నారు, మేమున్నామని ధైర్యం చెప్పారు, శాటిలైట్ ఫోన్లో ఆత్మీయులకు కాల్ చేసుకునే వెసులుబాటు కల్పించారు.
లాచెన్.. లాచెంగ్త్తో ఇబ్బందులు..
సరళకుమారి బృందం లాచెన్లో క్షేమంగా తలదాచుకున్నారు. కానీ, దగ్గర్లోనే లాచెంగ్త్ అనే ప్రాంతమూ ఉందట. అక్కడా వరద ప్రభావం ఉంది. దీంతో లాచెన్కు వెళ్లాల్సిన రెస్క్యూ హెలికాప్టర్.. సమన్వయ లోపం కారణంగా లాచెంగ్త్ వెళ్లింది. అక్కడ సరళకుమారి అనే పేరుతో ఏ టూరిస్టూ లేకపోవడం, అందులోనూ అప్పటికే కుండపోతగా వర్షం కురుస్తుండటంతో సహాయక చర్యలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. వాతావరణం అనుకూలించక పోవడంతో సరళకుమారి బృందం కోసం అన్వేషణ వాయిదాపడింది. ఆ మరునాడు హెలికాప్టర్లు లాచెన్ చేరుకున్నాయి. అందర్నీ సురక్షితంగా సిలిగురి తీసుకొచ్చారు. అక్కడినుంచి ఆర్మీ వాహనాలతో గ్యాంగ్టక్కు చేర్చారు. విమాన మార్గంలో హైదరాబాద్లో దించారు. మిగతా టూరిస్టులను కూడా క్షేమంగా తీసుకొచ్చారు. మన గడ్డమీద కాలు పెడుతుంటే.. ప్రతి ఒక్కరిలో మృత్యువును గెలిచిన ఆనందం, ఉద్వేగం
అందరికీ కృతజ్ఞతలు
చిన్నప్పటి నుంచీ నాకు ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించడం ఇష్టం. కొండలు, గుట్టలు ఎక్కడమంటే ఆసక్తి. ఇది అనుకోని ప్రళయం. కళ్లముందే ఆర్మీ బేస్లు వరదపాలు అయ్యాయి. పర్యాటకులు వరదల్లో కొట్టుకుపోయారు. ఒక్క నిమిషం ఆగితే.. మేము కూడా ఆ జల ప్రళయానికి బలయ్యే వాళ్లమే. అదృష్టం మావైపు ఉంది. సైనికులు మమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆర్మీని
సంప్రదించిన తర్వాత అయితే.. గంటకోసారి ఎవరో ఒకరు వచ్చి తిన్నారా లేదా అని అడుగుతూనే ఉన్నారు. మాకు సాయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.
…? రవికుమార్ తోటపల్లి