కాశీబుగ్గ, జూన్ 17: రాష్ట్రంలో ఉన్న అర్హులైన జర్నలిస్టులు ఎవరూ ఇండ్ల స్థలాల కోసం ఆందోళన చెందొద్దని, అర్హులందరికీ ఇండ్ల స్థలాలు వస్తాయని మున్సిపల్ శాఖ మంత్రి కే తారక రామారావు స్పష్టంచేశారు. శనివారం వరంగల్ జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్ను టీయూడబ్ల్యూజే (143) నేతలు ఇండ్ల స్థలాలు, జర్నలిస్ట్ల సమస్యలపై కలిసి విన్నవించారు. వరంగల్ జిల్లాలో రెండు జర్నలిస్టు హౌసింగ్ సొసైటీలు ఉండగా అధికారులు గతంలోనే వాటికి భూములను కేటాయించారని, భూమి ధర చెల్లింపునకు ఖాతా నంబర్ ఇస్తే తాము డబ్బులు చెల్లిస్తామని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. హౌసింగ్ సొసైటీల్లో లేని జర్నలిస్టుల ఇండ్ల స్థలాల విషయమై టీయూడబ్ల్యూజే 143 నేతలు కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి కేటీఆర్.. రెండు హౌసింగ్ సొసైటీల్లోని సభ్యులు పోగా, మిగిలిన సభ్యుల జాబితాను రూపొందించాలని మీడి యా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణకు సూచించారు. జాబితా ఫైనల్ అయితే వారికి కూడా ఇండ్ల స్థలాలు కేటాయించాలని అక్కడే ఉన్న కలెక్టర్లను ఆ దేశించారు. హైదరాబాద్ జర్నలిస్ట్ల ఇండ్ల స్థలాలపై నిన్ననే అల్లం నారాయణతో మాట్లాడానని, జేఎన్జే సొసైటీ సహా ప్రతీ జర్నలిస్ట్కు ఇండ్లు అందించే విషయమై త్వరలోనే చర్యలు తీసుకుంటామని చెప్పారు. మంత్రితో భేటీ అయిన వారిలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు సంఘం ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతిసాగర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డి తదితరులు ఉన్నారు.