హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు చార్జీల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలాగైనా బద్నాం చేయాలని విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో వ్యవసాయానికి పూర్తి ఉచితంగా విద్యుత్తును అందజేయడంతోపాటు గృహ, పారిశ్రామిక అవసరాలకు 24 గంటలూ నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్నప్పటికీ ప్రతిపక్షాలు ఈ వాస్తవాలనేమీ ప్రజలకు చెప్పకుండా విద్యుత్తు చార్జీలు భారీగా పెరిగాయని గగ్గోలు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల్లో గృహ విద్యుత్తు వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్న చార్జీలపై ‘నమస్తే తెలంగాణ’ జరిపిన పరిశీలనలో ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడయ్యాయి. కేవలం ఒకట్రెండు రాష్ర్టాలు మినహా మిగిలిన అన్ని రాష్ర్టాల్లో తెలంగాణ కంటే ఎక్కువగా చార్జీలను వసూలు చేస్తున్నట్టు తేటతెల్లమయ్యింది. వాటితో పోలిస్తే మన రాష్ట్రంలో విద్యుత్తు చార్జీలు చాలా తక్కువగా ఉన్నట్టు స్పష్టమైంది.
వినియోగించిన విద్యుత్తుకు ఇతర మార్గాల్లో వసూలు చేసే చార్జీలు సైతం తెలంగాణలోనే తక్కువగా ఉన్నట్టు వెల్లడైంది. ఇతర రాష్ట్రల్లో ఎనర్జీ చార్జెస్తోపాటు ఫిక్స్డ్ చార్జీలు, కస్టమర్ చార్జీలు, ఎలక్ట్రిసిటీ డ్యూటీల రూపంలో వినియోగదారుల నుంచి భారీగా వసూలు చేస్తున్నట్టు స్పష్టమవుతున్నది. ఆ వివరాలు ఇవీ..
రాష్ట్రంలో విద్యుత్తు చార్జీల పెంపుపై వాస్తవ పరిస్థితులను పరిశీలించి ఆలోచిస్తే ఏది నిజమో, ఏది అబద్ధమో ప్రజలకే అర్థమవుతుంది. నిజానికి అనేక రాష్ర్టాల్లో ఏటా విద్యుత్తు చార్జీలను పెంచుతున్నప్పటికీ తెలంగాణలో గత ఐదేండ్లుగా పెంచలేదు. తాజాగా డిస్కంలు 18% పెంచాలని ప్రతిపాదించినప్పటికీ 14% పెంపునకే అనుమతించాం. అంటే సంవత్సరానికి కేవలం 3% లోపే పెరిగినట్టవుతుంది. ప్రస్తుతం టన్ను బొగ్గు ధర రూ.800 వరకు, క్లీన్ ఎనర్జీ చార్జీ టన్నుకు రూ.50 నుంచి రూ.400కు పెరిగింది. దీంతో వార్షికంగా రూ.1,250 కోట్ల అదనపు భారం పడింది. రైల్వే రవాణా చార్జీలు సైతం 40% పెరిగాయి. అయినా రాష్ట్రంలో విద్యుత్తు ఉత్పత్తిని పెంచుకొన్నాం. రూ.35 వేల కోట్లతో విద్యుత్తు సరఫరా, పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేసుకొని 26 లక్షల వ్యవసాయ పంప్సెట్లతోపాటు దోబీఘాట్లు, సెలూన్లు, లాండ్రీలు, నిరుపేద ఎస్సీ, ఎస్టీలకు, ఉచితంగా విద్యుత్తును అందజేయగలుగుతున్నాం. కుటీర పరిశ్రమలతోపాటు పౌల్ట్రీలు, చేనేత మగ్గాలకు రాయితీ కల్పిస్తున్నాం. వీటివల్ల పడుతున్న అదనపు భారాన్ని అధిగమించేందుకు విద్యుత్తు చార్జీలను స్వల్పంగా పెంచక తప్పలేదు. ఈ అనివార్యతను అర్థం చేసుకోవాల్సిందిగా ప్రజలను కోరుతున్నాం.
– దేవులపల్లి ప్రభాకర్రావు, సీఎండీ, ట్రాన్స్కో, జెన్కో