బోధన్, అక్టోబర్ 8: సిక్కిం వరదల్లో గల్లంతై ప్రాణాలు కోల్పోయిన నిజామాబాద్ జిల్లా సాలూరా మండలం కుమ్మన్పల్లికి చెందిన ఆర్మీ జవాన్ నీరడి గంగాప్రసాద్కు ఆదివారం గ్రామంలో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. వేలాదిమంది అశ్రునయనాల మధ్య వీర జవాన్ అంతిమయాత్ర కొనసాగింది. సైన్యంలో ఆయన లాన్స్నాయక్ హోదాలో పనిచేశారు.
శనివారం గంగాప్రసాద్ పార్థివ దేహం ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు, అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో ఆదివారం ఉదయం స్వగ్రామానికి చేరుకున్నది. బోధన్ పట్టణం నుంచి నాగన్పల్లి, సాలూరా క్యాంప్ గ్రామాల మీదుగా స్వగ్రామం కుమ్మన్పల్లి గ్రామం వరకు గంగాప్రసాద్ భౌతికకాయాన్ని భారీ ర్యాలీతో తీసుకువచ్చారు. భర్త మృతదేహాన్ని చూసిన భార్య శిరీష, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
జవాన్ భౌతికకాయంపై కలెక్టర్ రాజీవ్ హన్మంతు, సీపీ సత్యనారాయణ, సైనికాధికారులు, ఇతర ఉన్నతాధికారులు పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ప్రసాద్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. సైనికులు గంగాప్రసాద్ పాడెను తమ భుజాలపై శ్మశాన వాటిక వరకు మోశారు. సైనికులు గాల్లోకి కాల్పులు జరిపి గౌరవ వందనం చేశారు. అనంతరం తండ్రి కాశీరాం కొడుకు గంగాప్రసాద్ చితికి నిప్పుపెట్టారు.