హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ మరోసారి సత్తా చాటింది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది మొద టి ఆరునెలల్లో నివాసగృహాల అమ్మకాలు, కొత్త ప్రాజెక్టుల వృద్ధిలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. అదే సమయంలో ధరలు స్థిరంగా ఉన్నాయని ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ నైట్ఫ్రాంక్ వెల్లడించింది. ఈ ఏడాది తొలి ఆరునెలల్లో (హెచ్1) దేశంలో రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితిపై ‘జనవరి-జూన్ 2021’ పేరుతో నివేదికను విడుదల చేసింది. 2020తో పోల్చితే ఈ ఏడాది హైదరాబాద్లో అమ్మకాలు 150 శాతం పెరిగాయని తెలిపింది. కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పెరుగడంతో అదేస్థాయిలో కొత్త ప్రాజెక్టు లు ప్రారంభమయ్యాయని తెలి పింది. హెచ్1లో కొత్త లాంచింగ్స్ 278 శాతం పెరిగాయని, ఇది దేశంలోనే అత్యధికమని పేర్కొన్నది.
హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగాన్ని ఐటీ ఇండస్ట్రీ కాపాడిందని నైట్ఫ్రాంక్ వెల్లడించింది. ఐటీలో తెలంగాణ అగ్రగామిగా కొనసాగుతుండటం, ప్రపంచస్థాయి సంస్థలను ఆకర్షిస్తుండటం ఒక కారణం కాగా.. ఐటీ పరిశ్రమపై సెకండ్ వేవ్ ప్రభావం ఏమాత్రం లేకపోవడం మరో కారణమని చెప్పింది. మరోవైపు లాక్డౌన్ సమయంలో అనేకరంగాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగిందని తెలిపిం ది. దీంతో లాక్డౌన్లోనూ జీతాల్లో కోత పడలేదని, ఆదాయంపై ప్రభావం కనిపించలేదని వెల్లడించింది. ఫలితంగా కొనుగోళ్లు పెరిగాయని వివరించింది. మరోవైపు బ్యాంకులు లోన్లపై ఆఫర్లు ప్రకటించడం, తక్కువ వడ్డీ వంటివి కూ డా సహకరించాయని తెలిపింది. వర్క్ ఫ్రమ్ హోమ్, డిజిటల్ స్కూలింగ్ పెరుగడంతో పెద్ద ఇండ్లు కావాలనుకునే వారి సంఖ్య పెరిగిందని పేర్కొన్నది.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో పశ్చిమ ప్రాంతానిదే ఆధిపత్యం. ఐటీ విస్తరించి ఉన్న మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కూకట్పల్లి, కోకాపేటను పశ్చిమప్రాంతంగా పిలుస్తుంటారు. ఈ ఏడాది హెచ్ 1 లోనూ హైదరాబాద్ వెస్ట్ తన ఆధిపత్యం కొనసాగించింది. తొలి ఆరునెలల్లో ప్రారంభమైన కొత్త ప్రాజెక్టుల్లో 64 శాతం ఇక్కడే నమోదయ్యాయి. గతేడాది హెచ్1లో 59 శాతంగా ఉండగా, ఈసారి మరింత పెరిగింది. అమ్మకాల్లోనూ పశ్చిమప్రాంతానిదే అగ్రభాగం. మొత్తం అమ్మకాల్లో గతేడాది 59 శాతం వాటా ఉండగా, ఈసారి 63 శాతంగా నమోదైంది.
హైదరాబాద్లో నివాస గృహాల ధరలు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. గతేడాది తొలి ఆరు నెలలతో పోల్చితే కేవలం ఒక్క శాతం మాత్రమే పెరిగాయి. కొత్త ప్రాజెక్టులు పెరుగడంతో అమ్ముడుపోని యూనిట్ల సంఖ్య దాదాపు రెట్టింపయ్యిందని నివేదిక తెలిపింది. దీంతోపాటు రెండో త్రైమాసికంలో కరోనా సెకండ్వేవ్ విజృంభించడం, లాక్డౌన్తో అమ్మకాలు కాస్త తగ్గడం కూడా మరో కారణమని వెల్లడించింది.
వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతి పెరుగడంతో ఇండ్లు పెద్దగా ఉండాలని కోరుకుంటున్నవారి సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యంలో కొత్త ప్రాజెక్టుల్లో రూ.కోటి నుంచి రూ.2 కోట్ల మధ్య ఉండే ఇండ్ల వాటా పెరిగింది. గతేడాది జూలై-డిసెంబర్ (హెచ్2) మధ్య 18 శాతంగా (1,544 యూనిట్లు) ఉండగా, ఏడాది హెచ్1లో 27 శాతానికి (4,444) పెరిగింది. అదే సమయంలో అమ్మకాల్లో మాత్రం రూ.50 లక్షల నుంచి రూ.కోటి మధ్య ఉండే యూనిట్ల ఆధిపత్యం కొనసాగింది. గతేడాది అమ్మకాల్లో ఈ క్యాటగిరీ వాటా 40 శాతం ఉండగా.. ఈసారి కాస్త పెరిగి 44 శాతానికి చేరింది.
నివాస గృహాల అమ్మకాల్లో హైదరాబాద్ గణనీయ వృద్ధిరేటు నమోదు చేసింది. డిమాండు, సప్లయి రెండు విభాగాల్లో వృద్ధి రేటు గత ఏడాదితో పోల్చితే రెండితలుగా పెరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఐటీ కంపెనీలు మెరుగైన పనితీరును కనబర్చడంతో నివాస గృహాల కొనుగోళ్లు పెరగడానికి దారితీసింది. దీంతోపాటు పెట్టుబడులు సైతం అదేస్థాయిలో రావడంతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ వృద్ధి రేటు ఎంతో ఆశాజనకంగా ఉన్నట్టు తేలింది. రాష్ట్ర ప్రభుత్వం నగరంలో మౌలికవసతుల కల్పనకు అధిక ప్రాధ్యానత ఇవ్వడమే కాకుండా ఎంతో వేగవంతంగా వాటిని కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నది. నివాస గృహాల స్థలాల ధరలు గతేడాదితో పోల్చితే 1 శాతం పెరిగాయి.
-శ్యాంసన్ అర్థర్, హైదరాబాద్ బ్రాంచ్ డైరెక్టర్, నైట్ఫ్రాంక్ ఇండియా