హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇండ్ల నిర్మాణానికి ఆన్లైన్లో అనుమతులు పొందడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 30వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఈ-పంచాయతీ విధానంపై ప్రజల్లో చైతన్యం పెరిగింది. ఈ విధానంలో ముందుగా జనన, మరణ ధ్రువపత్రాలు జారీచేశారు. ఆ తరువాత భవన నిర్మాణాలకు, లే అవుట్లకు, ట్రేడ్ లైసెన్సులకు అనుమతులు ఇచ్చారు. ఆపై పన్ను చెల్లింపులు, బిల్డింగ్ మ్యుటేషన్ తదితర సేవలను అందించేందుకు ఈ-పంచాయతీని విస్తరించారు. దీనిపై అవగాహన పెంచుకున్న గ్రామీణులు ఇంటి నిర్మాణాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేస్తున్నారు. ఇప్పటివరకు 49,946 మంది దరఖాస్తు చేసుకోగా వీటిలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 29,671 దరఖాస్తులు వచ్చాయి. గిరిజన ప్రాంత ప్రజలు ఎక్కువగా ఉండే ములుగు, భూపాలపల్లి, ఆసిఫాబాద్, కొత్తగూడెం లాంటి జిల్లాల్లో తక్కువ సంఖ్యలో ఆన్లైన్లో దరఖాస్తులు వస్తున్నట్టు గణాంకాలను బట్టి తెలుస్తున్నది. అత్యధికంగా దరఖాస్తులు వస్తున్న జిల్లాల్లో నిజామాబాద్ ముందుండగా ఆ తరువాత జగిత్యాల, రంగారెడ్డి, సిరిసిల్ల, భువనగిరి ఉన్నాయి. దరఖాస్తు చేసుకున్న 15రోజుల్లోనే అధికారులు అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది.
ఇలా దరఖాస్తు చేసుకోవాలి
గ్రామాల్లో గ్రామ కార్యదర్శికి జీ ప్లస్ టూ వరకు ఇండ్లకు అనుమతి ఇచ్చే ఆధికారం ఉన్నది. ఆ తరువాత డీటీసీపీ దరఖాస్తు చేసుకోవాలి. ://epanchayat. telangana.gov.in/cs వెబ్సైట్లో బిల్డింగ్ పర్మిషన్ ఆప్షన్ మీద క్లిక్చేయాలి. ఆ తరువాత రిజిస్ట్రేషన్ చేసుకొని ఇంటికి దరఖాస్తు చేసుకోవచ్చు.