హైదరాబాద్ : మావోయిస్టుల కాల్పుల్లో గాయపడిన కానిస్టేబుల్ను రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ, డీజీపీ మహేందర్రెడ్డి, గ్రేహౌండ్స్ అదనపు డీజీపీ కే శ్రీనివాస్రెడ్డి, గ్రేహౌండ్స్ ఓఎస్డీ దయానంద్తో కలిసి పరామర్శించారు. ములుగు – బీజాపూర్ జిల్లా బోర్డర్లోని కర్రిగుట్టల అటవీ ప్రాంతంలో ఈ నెల 18న తెల్లవారు జామున పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మహేశ్ చేతికి బుల్లెట్ గాయమైంది.
దీంతో వెంటనే అతన్ని హెలీకాప్టర్లో హైదరాబాద్కు తరలించారు. వైద్యులు బుధవారం చేతికి శస్త్ర చికిత్స చేశారు. ఈ సందర్భంగా హోంశాఖ మంత్రి, ఉన్నతాధికారులతో కలిసి పరామర్శించి, ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అలాగే కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు, బంధువులతోనూ మాట్లాడారు. మహేశ్ ఆరోగ్య పరిస్థితి స్థిరంగానే ఉందని, కోలుకుంటున్నాడని, త్వరలోనే డిశ్చార్జి చేస్తామని ఆసుపత్రి వైద్యులు హోంమంత్రికి వివరించారు. ప్రభుత్వం తరఫున మహేశ్కు అవసరమైన సహాయాన్ని అందజేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.