Mahmood Ali | హైదరాబాద్ : దేశంలో ముస్లిం మైనార్టీలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నా.. తెలంగాణలో ముస్లిం, మైనార్టీలంతా సుఖసంతోషాలతో ఆనందంగా ఉన్నారని, అందుకు కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ అని హోం మంత్రి మహమూద్ అలీ చెప్పారు. మైనార్టీల రక్షణ కోసం అల్లాహ్ పంపిన దేవదూతగా సీఎం కేసీఆర్ను ఆయన అభివర్ణించారు.
తెలంగాణ భవన్లో మహముద్ అలీ మీడియాతో మాట్లాడారు. నాడు సమైక్య పాలనలో హిందూ, ముస్లింలు గొడవలు పెట్టుకుంటే.. నేడు స్వరాష్ట్రంలో సోదరుల్లా కలిసిమెలిసి ఉన్నారు. కేవలం తొమ్మిదన్నరేండ్ల కాలంలో వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేసి ముస్లిం, మైనార్టీల అభ్యున్నతికి కేసీఆర్ ఎంతో కృషి చేశారని స్పష్టం చేశారు. తొమ్మిదేండ్ల కేసీఆర్ పాలనలో ఒక్క కర్ఫ్యూ కూడా పెట్టిన దాఖలాలు లేవని, శాంతిభద్రతలు కాపాడుకుంటూ సకల జనుల సంక్షేమానికి కేసీఆర్ పెద్దపీట వేశారని పేర్కొన్నారు. తెలంగాణలోని అన్ని వర్గాలతో పాటుగా మైనార్టీ వర్గాలను ఆదుకుంటూ వారి పాలిట దేవుడిగా నిలిచారని హోంమంత్రి చెప్పారు.