హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): స్కూల్ గ్రాంట్.. బడుల్లో రోజువారీ ఖర్చులకు ఈ గ్రాంటే ఆధారం. రిజిస్టర్లు, స్టేషనరీ కొనాలన్నా, విద్యుత్తు, ఇంటర్నెట్ బిల్లులు చెల్లించాలన్నా, పంద్రాగస్టుకో, 26 జనవరికో స్వీట్లు పంపిణీ చేయాలన్నా, పారిశుధ్య కార్మికులకు గౌరవ వేతనం, స్కూళ్లకు మరమ్మతులు చేయాలన్నా ఈ నిధులే కీలకం. కానీ ఈ నిధులున్నా వినియోగించుకోలేని పరిస్థితి రాష్ట్రంలోని స్కూళ్లల్లో నెలకొన్నది. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ)లు మనుగడలో లేకపోవటమే ఇందుకు కారణం. స్కూల్ గ్రాంట్ నిధులను రాష్ట్ర విద్యాశాఖ ఎస్ఎంసీ ఖాతాల్లో జమ చేస్తుంది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఎస్ఎంసీ చైర్మన్ పేర్లతో ఉండే జాయింట్ అకౌంట్లో జమచేస్తుంది. చెక్పవర్ ఇద్దరికీ ఉంటుంది. ఎస్ఎంసీల గడువు ముగియగా, ఎన్నికలు నిర్వహిచేందుకు పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ను విడుదల చేసింది. ఆ వెంటనే ఎన్నికలను నిలిపివేసింది.
మునుగడలో ఉన్న పాత ఎస్ఎంసీలను రద్దుచేసింది. దీంతో ఎస్ఎంసీలు లేకుండా పోయాయి. మొదటి విడత గ్రాంట్ను బ్యాంకుల్లో జమ చేయగా, రెండో విడత ఇంకా మంజూరు కాలేదు. అయితే, ఎస్ఎంసీ చైర్మన్లు లేకపోవడంతో నిధులను విత్డ్రా చేయలేని పరిస్థితి తలెత్తింది. దీంతో హెచ్ఎంలు డోలాయమానంలో పడ్డారు. విద్యాసంవత్సరం, ఆర్థిక సంవత్సరం రెండు ముగింపు దశకు చేరుకోవడంతో విద్యాశాఖ దీనిపై స్పష్టతనివ్వాలని టీచర్ల సంఘాలు కోరుతున్నాయి. పంచాయతీరాజ్, ప్రభుత్వ స్కూళ్లతో పాటు, పీఎంశ్రీ పథకంలో ఎంపికైన స్కూళ్లదీ ఇదే పరిస్థితి. ఈ స్కూళ్లు సైతం స్కూల్ గ్రాంట్ను వినియోగించుకోలేకపోతున్నాయి. ప్రైమ్ మినిస్టర్ స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎంశ్రీ స్కూల్స్) పథకానికి ఎంపికైన స్కూళ్లకు పాఠశాల విద్యాశాఖ ఇటీవలే స్కూల్ గ్రాంట్ నిధులను విడుదల చేసింది. రాష్ట్రంలో 543 స్కూళ్లుండగా, 100 శాతం గ్రాంట్స్గా రూ.5.13 కోట్లు విడుదల చేసింది. ఎస్ఎంసీలు లేకపోవడం ఆయా నిధులను వినియోగించుకోలేని, బిల్లులు చెల్లించలేని పరిస్థితి నెలకొన్నది.
కొత్త ఎస్ఎంసీల ఎన్నికకు షెడ్యూల్ ప్రకటించి, ఎన్నికలను నిలిపివేశారు. పాత ఎస్ఎంసీలను రద్దుచేశారు. దీంతో స్కూళ్లకు ఎస్ఎంసీలు లేకుండాపోయాయి. కానీ స్కూల్ గ్రాంట్స్ను ఎలా విత్డ్రా చేసుకోవాలో విద్యాశాఖ తెలపలేదు. విద్యాసంవత్సరం ముగింపునకు చేరుకున్నది. విద్యార్థులు, బడుల శ్రేయస్సు దృష్ట్యా నిధులను బ్యాంక్ల నుంచి ఎలా విత్డ్రా చేసుకోవాలో స్పష్టమైన ఆదేశాలివ్వాలి. చెక్ పవర్ను మరొకరికి ఇచ్చే అంశంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలి. దీంతో పాటు రెండో విడత స్కూల్ గ్రాంట్ నిధులను వెంటనే మంజూరు చేయాలి.
– మల్లికార్జున్రెడ్డి, హెచ్ఎం, హైదరాబాద్
స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ) జాయింట్ చెక్పవర్ ఉత్తర్వులు వెంటనే ఇవ్వాలి. డిసెంబర్ 31 నుంచి ఎస్ఎంసీలు రద్దుకావడంతో గతంలో విడుదలైన నిధులు విత్డ్రా చేసుకోవడం సాధ్యపడటం లేదు. మిగిలిన 50శాతం నిధులు, 100శాతం స్కూల్ కాంప్లెక్స్, ఎంఆర్సీ గ్రాంట్స్ను వెంటనే విడుదల చేయాలి. 2023 -24 విద్యాసంవత్సరం యూనిఫారాల కుట్టుకూలీ చార్జీలను కూడా రిలీజ్ చేయాలి.
– రాజభాను చంద్రప్రకాశ్, గెజిటెడ్ హెచ్ఎం అసొసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు