హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): సామాన్యుల సొంతింటి కల సాకారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్(టీఆర్ఎస్సీఎల్) ఫ్లాట్ల విక్రయానికి రంగం సిద్ధంచేస్తున్నది. పోచారం, బండ్లగూడతోపాటు రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో అమ్ముడుపోని, నిర్మాణం పూర్తికాని ఫ్లాట్ల వేలం కోసం గతంలో దరఖాస్తుదారులు చెల్లించిన ప్రాసెసింగ్ ఫీజులు, కిస్తీలను వాపస్ చేస్తున్నది. వాస్తవానికి అన్ని వాయిదాలు చెల్లించటంలో విఫలమైనవారికి రీఫండ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ, ఇప్పటివరకు కట్టిన వాయిదాల డబ్బులు తిరిగి చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఆదేశాలిచ్చిందని టీఆర్ఎస్సీఎస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. చెల్లింపు రశీదులు సమర్పించాలని నోటిఫికేషన్ సైతం విడుదలచేసినట్టు పేర్కొన్నారు. కొందరు దరఖాస్తుదారులు రూ.25 వేలు, రూ.లక్ష, కొన్ని ఇన్స్టాల్మెంట్లు చెల్లించారని, ఇప్పుడు వారందిరికీ డబ్బు తిరిగి చెల్లిస్తామని చెప్పారు. ఫ్లాట్ల వేలం కోసమే ఈ చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. వేలం విధివిధానాలపై మార్గదర్శకాలు రాలేదని చెప్పారు. ప్రతి ఫ్లాట్ను వేలం వేయాలా.. టవర్ ప్రాతిపదిక వేలం వేయాలా అనేది తెలియాల్సి ఉందని తెలిపారు. కార్పొరేషన్ అభివృద్ధి చేసిన ఓపెన్ ప్లాట్ల వివరాలను సైతం సిద్ధంచేయాలని జిల్లాల కలెక్టర్లను ఆదేశించినట్టు చెప్పారు.
ప్రభుత్వ నిర్ణయంతో మోక్షం
మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను నెరవేర్చేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్ చందానగర్, బండ్లగూడ, పోచారం, జవహర్నగర్, గాజులరామారంతోపాటు ఖమ్మంలో మొత్తం ఆరు ప్రాజెక్టులను చేపట్టింది. త్రీ బీహెచ్కే, 2.5 బీహెచ్కే, 2 బీహెచ్కేలుగా నిర్మాణాలు చేపట్టింది. బహిరంగ మార్కెట్ ధర కంటే రాజీవ్ స్వగృహ ఇండ్ల ధరలు అధికంగా ఉండటంతో కొనుగోలుకు ఎవరూ ముందుకు రాలేదు. ఏండ్లుగా ఆ నిర్మాణాలు ఖాళీగా ఉన్నాయి. వీటి నిర్మాణానికి తెచ్చిన బ్యాంకు రుణాలు, వడ్డీలు తెలంగాణ ప్రభుత్వానికి భారంగా మారాయి. దీనిని గుర్తించిన కేసీఆర్ సర్కారు.. బ్యాంకులకు వడ్డీతో సహా రూ.1071.39 కోట్లు తిరిగి చెల్లించింది. ఈ ఫ్లాట్లు విక్రయానికి వస్తే సొంతిల్లు కట్టుకోవాలనే సామాన్యుల కల నెరవేరనున్నది.