హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పోలీస్ శాఖకు డీజీపీ మహేందర్రెడ్డి చేసిన సేవలు మరువలేనివని హోంమంత్రి మహమూద్ అలీ ప్రశంసించారు. శుక్రవారం హైదరాబాద్ లక్డీకాపూల్లోని హోంమంత్రి కార్యాలయంలో డీజీపీకి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. మహేందర్రెడ్డికి హోంమంత్రి చార్మినార్ జ్ఞాపికను అందించి, సన్మానించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా, డీజీపీగా దాదాపు 34 సంవత్సరాలపాటు పోలీసు అధికారిగా వివిధ హోదాల్లో పనిచేసి మహేందర్రెడ్డి అందరి మన్ననలు పొందారని కొనియాడారు. ఆయన ఏ హోదాలో పనిచేసినా నిబద్ధతను చాటారని, పోలీసు శాఖ కీర్తిని మరింత పెంచారని అన్నారు. డీజీపీగా మహేందర్రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత పోలీస్శాఖలో ఎన్నో కొత్త సంస్కరణలు తీసుకొచ్చారని చెప్పారు. ఐదేండ్లకుపైగా డీజీపీగా పనిచేసిన మహేందర్రెడ్డి.. తెలంగాణ పోలీస్ శాఖను దేశంలోనే అగ్రభాగాన నిలిపారని కొనియాడారు. కార్యక్రమంలో హోం శాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా, అడిషనల్ డీజీపీలు జితేందర్, సంజయ్కుమార్ జైన్ తదితరులు పాల్గొన్నారు.