హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 14: హనుమకొండ జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ అగ్గలయ్యగుట్టపై శివలింగం, ఇతర చిత్రాలు ఉన్నట్టు చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్రెడ్డి వెల్లడించారు. అగ్గలయ్యగుట్టను, పద్మాక్షి గుట్టకు కలుపుతూ ఒక కోట గోడ నిర్మించినట్టు ఆధారాలు ఉన్నాయని, రెండు గుట్టల నడుమ రాతి స్తంభాలతో నిలబెట్టిన తోరణ ద్వారం ఉందని వివరించారు.
ఈ ద్వారం సమీపంలో గుట్ట దిగువన శివలింగం, ఢమరుకం, దీపం, గంటు చిత్రాలు వేయబడినట్టు తెలిపారు. చాళుక్యుల కాలంలో 9, 10 శతాబ్దాల నాటికి అగ్గలయ్యగుట్ట ప్రసిద్ధ జైనుల కేంద్రంగా విరాజిల్లిందని తెలిపారు. కాలక్రమంలో 11వ శతాబ్దం నాటికి కాకతీయులు పాలనలోకి వచ్చారని, శైవమత ప్రాబల్యం పెరిగిందని చెప్పారు. అందులో భాగంగానే అగ్గలయ్యగుట్ట దిగువన శైవమత చిత్రాలు గీయబడినట్టు, చిత్రాలు రోడ్డుకు పకనే ఉండటంతో రోడ్డు ఎత్తు పెరిగి ఈ చిత్రాలు కిందికి వెళ్లాయని వివరించారు. చిత్రాల రక్షణకు పురావస్తు శాఖ చర్యలు తీసుకోవాలని రెడ్డి రత్నాకర్రెడ్డి కోరారు.