భువనగిరి అర్బన్, మార్చి 12 : యాదాద్రి భువనగిరి పట్టణం సమీపంలోని ఖిల్లా కందకం వద్ద ఈ నెల 11న అభివృద్ధి పనుల కోసం చేపట్టిన తవ్వకాల్లో పలు పురాతన కట్టడాలు బయటపడ్డాయి. దీంతో ఆదివారం పురావస్తు శాఖ ఉమ్మడి మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాల అసిస్టెంట్ డైరెక్టర్ బుజ్జి ఆ ప్రదేశాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భువనగిరి ఖిల్లాపై కోటను నిర్మించిన త్రిభువన ఆరో విక్రమాదిత్యుడి కాలంలో ఎన్నో దేవాలయాలను నిర్మించారని తెలిపారు.
స్తంభాలు, సింహ (యాలి) స్తంభాలు బయట పడడంతో ఇకడ దేవాలయం, మండపం ఉండవచ్చని భావిస్తున్నట్టు చెప్పారు. వీటితోపాటు పట్టణంలో 12వ శతాబ్దంలో కాకతీయ రాజు ప్రతాపరుద్రుడి కాలానికి చెందిన సంస్కృతంలో చెక్కబడిన రాతి శిలా శాసనం లభించిందని తెలిపారు. దీంతో భువనగిరి పరిసర ప్రాంతాల్లో లభించిన చారిత్రక సంపదను ప్రదర్శించేందుకు మ్యూజియం ఏర్పాటు కోసం ఉన్నతాధికారులను కోరుతామని తెలిపారు.
అనంతరం పట్టణంలోని బీచ్మహల్ ప్రభుత్వ-1 ఉన్నత పాఠశాల వద్ద బయటపడిన రాతి శాసనాన్ని పరిశీలించారు. ఆదివారం సాయంత్రం తవ్వకాల్లో బయటపడిన సింహ స్తంభాన్ని భువనగిరి ఖిల్లా వద్దకు తరలించారు. అంతకు ముందు ఆలయ స్తంభాలు, మండపానికి చెందిన భాగాలను, సింహ (యాలి) స్తంభాల కొలతలను తీసుకున్నారు.