ఇకపై రాష్ట్రంలో అడ్వాన్స్డ్ హైటెక్ ఉత్పత్తుల తయారీ
జపాన్, కొరియా, తైవాన్ సరసన తెలంగాణ: కేటీఆర్
హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): అడ్వాన్స్డ్ హైటెక్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగానికి చెందిన దిగ్గజ సంస్థ రాజేశ్ ఎక్స్పోర్ట్స్ (ఎలెస్ట్) తెలంగాణలో రూ.24 వేల కోట్ల భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చినట్టు రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఫార్చ్యూన్-500 కంపెనీల్లో ఒకటైన ఈ సంస్థ దేశంలోనే తొలిసారి తన డిస్ప్లే ఫ్యాబ్ను హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. టీవీలు, స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు, ల్యాప్టాప్ల తయారీకి ఉపయోగించే అధునాతన అమోలెడ్ డిస్ప్లేల తయారీ యూనిట్ను నెలకొల్పేందుకు ఈ పెట్టుబడి పెట్టనున్నట్టు ఆదివారం ట్వీట్ చేశారు.
దేశీయ అడ్వాన్స్డ్ హైటెక్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగంలోకి వచ్చిన అతిపెద్ద పెట్టుబడుల్లో ఇది ఒకటని, రాష్ర్టానికి ఇది చారిత్రాత్మక రోజని తెలిపారు. ‘హైటెక్ తయారీ రంగంలో భారత్ను తెలంగాణ మరోసారి ప్రపంచపటంలో ముందు వరుసలో నిలిపింది. ఇప్పటి వరకు జపాన్, కొరియా, తైవాన్ దేశాలకు మాత్రమే సాధ్యమైన అడ్వాన్స్డ్ హైటెక్ ఉత్పత్తులు ఇకపై తెలంగాణలోనూ తయారవుతాయి. ఎలెస్ట్ రాకతో ప్రపంచస్థాయి టీవీ, స్మార్ట్ఫోన్, ట్యాబ్ల తయారీదారులకు అవసరమైన ఉత్పత్తులను సరఫరా చేసేందుకు అనువైన ఎకో సిస్టం తెలంగాణలో ఏర్పడుతుంది’ అని మంత్రి కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.