Marriage | వేములవాడ, ఫిబ్రవరి 27: భార్యలు దూరమై ఒంటరి జీవితం గడుపుతున్న పురుషులే అతడి టార్గెట్. మలిదశలో తోడు కోసం వెదుకుతున్న వ్యక్తులను పెండ్లి పేరు తో నమ్మించి, వారినుంచి లక్షలు దండుకోవడమే అతడి ప్లాన్. ఈజీ మనీ కోసం ఒకే యువతితో ముగ్గురు ఒంటరి పురుషులకు వేర్వేరుగా పెండ్లి చేయించి, కొద్దిరోజులకే అక్కడినుంచి యువతిని తప్పిస్తూ అమాయకులతో గేమ్ ఆడాడు. తాజాగా, ఆ యువతికి నాలుగో వ్యక్తితో పెండ్లి చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు కర్ణాటకకు చెందిన శివకుమార్. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం తాటిపల్లికి చెందిన లక్ష్మణ్కు నలుగురు పిల్లలు. 20 ఏండ్ల కింద భార్య మృతిచెందింది. మలిదశలో తోడు కోసం చూస్తున్న అతడు కర్ణాటకకు చెందిన శివకుమార్ను సం ప్రదించాడు.
8 నెలల క్రితం శివకుమార్ మహబూబ్నగర్ ప్రాంతానికి చెందిన యువతిని తీసుకొచ్చి లక్ష్మణ్ తో పెండ్లి జరిపించాడు. కొద్దిరోజులకే ఆ అమ్మాయి తల్లిగారింటికి వెళ్తున్నానని చెప్పింది. రోజులు గడుస్తున్నా రాకపోవడంతో లక్ష్మణ్ మధ్యవర్తి శివకుమార్కు ఫోన్చేయగా, వారంలో తిరిగొస్తుందని నమ్మబలికాడు. ఎన్నిరోజులైనా రాకపోయేసరికి లక్ష్మణ్ మోసపోయానని గ్రహించాడు. శివకుమార్ ఇలా ఇప్పటికే అదే అమ్మాయికి మరో ఇద్దరితో వివాహం జరిపించాడు. వారి వద్ద నుంచి లక్షలు దండుకొని, అనంతరం అమ్మాయిని తప్పించాడు. తాజాగా, అదే అమ్మాయికి రాజన్నసిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లి మండలంలో ఓ గ్రామానికి చెందిన యువకుడితో పెండ్లికి ఒప్పందం కుదుర్చుకొని వేములవాడకు వచ్చా డు. విషయం తెలుసుకొన్న లక్ష్మణ్, అతడి బంధువులు వేములవాడకు వచ్చి శివకుమార్ను పట్టుకొని పోలీసులకు అప్పగించారు.