నల్లగొండ : జిల్లా సహకార బ్యాంకు ద్వారా రైతులతో పాటు రైతు బిడ్డల చదువులకు కూడా రుణాలు మంజూరు చేసుకోవడం సంతోషకరమని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. విదేశాల్లో చదవాలనుకున్న రైతు బిడ్డలకు వ్యవసాయ భూముల మీద రుణాలు ఇస్తున్నట్లు తెలిపారు.
ఈ మేరకు జిల్లా కేంద్రంలోని డిసిసిబి కార్యాలయంలో నల్లగొండ రామగిరి బ్రాంచి ద్వారా మంజూరైన రుణాలను బుధవారం గొంగిడి మహేందర్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. తిప్పర్తికి చెందిన చనగోని ప్రశాంత్కు విదేశాలలో ఉన్నత చదువు కోసం విద్యా రుణం రూ.25లక్షల మంజూరు పత్రాన్ని అందజేశారు.
అదేవిధంగా దోమలపల్లి చెందిన గూడూరు అమరేందర్ రెడ్డి అనే రైతుకు కోళ్ల ఫారం నిర్మాణానికి రూ.20 లక్షల పౌల్ట్రీ లోన్ మంజూరు పత్రాన్ని అందజేశారు.
రుణాలను సద్వినియోగం చేసుకుని జీవితంలో ఆర్థికంగా ఎదగాలని ఆకాక్షించారు. కార్యక్రమంలో డిసిసిబి వైస్ చైర్మన్ ఏసిరెడ్డి దయాకర్ రెడ్డి, డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, సీఈఓ మదన్ మోహన్, బ్యాంకు అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.