హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): పల్లెలను ప్రగతి పథాన నడిపించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చిందని సామాజిక ఆర్థిక సర్వే వెల్లడించింది. 73, 74వ రాజ్యాంగ సవరణ స్ఫూర్తిని పెంపొందించే దిశగా అనేక కార్యక్రమాలు, సంస్కరణలను చేపట్టిందని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పంచాయతీరాజ్ చట్టం ద్వారా గ్రామాల్లో ఎంతో మార్పు వచ్చిందని పేర్కొంది. కేంద్రం ఇస్తున్న ఆర్థిక సంఘం నిధులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులను విడుదల చేస్తున్నదని తెలిపింది. గ్రామ పంచాయతీ కార్యదర్శులను పెద్ద ఎత్తున నియమించిందని, ఖాళీ స్థానాలను భర్తీ చేసే అధికారి కలెక్టర్లకు కల్పించిందని పేర్కొంది. ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల్లో పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాలు, వృక్ష సంపద పెరిగాయని తెలిపింది. తెలంగాణలో 4,383 తండాలను పంచాయతీలుగా మార్చారని, 1,245 గ్రామాలకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నదని వివరించింది. పంచాయతీలకు కొత్త భవనాలు నిర్మిస్తున్నారని, 6,765 పంచాయతీలకు కంప్యూటర్ సదుపాయం కల్పించారని తెలిపింది. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి నల్లాల ద్వారా రక్షిత మంచినీరు సరఫరా అవుతున్నదని పేర్కొంది. ఇందుకోసం రూ.34,088 కోట్లు ఖర్చు చేసినట్టు వెల్లడించింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించినందుకు నీతి ఆయోగ్ 2019-20లో మొదటి బహుమతిని తెలంగాణకు అందించిందని గుర్తుచేసింది.
కరోనా సమయంలో ఉపాధి
ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయడంలో తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ముందున్నదని సామాజిక ఆర్థిక సర్వే తెలిపింది. కరోనా సమయంలో ఉపాధి హామీ పనులు ఎంతగానో ఉపయోగపడ్డాయని పేర్కొంది. తెలంగాణలోని 32 జిల్లాల్లో 540 మండలాల్లో 12,770 గ్రామాల్లో 53.5ల క్షల జాబ్కార్డులు జారీ అయ్యాయని తెలిపింది. డిసెంబర్ నెలాఖరు వరకు 13.50కోట్ల పనిదినాలను కూలీల కోసం కల్పించారని తెలిపారు.