హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంలో తనను పోలీసు కస్టడీకి అప్పగిస్తూ కింది కోర్టు జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్కుమార్ అలియాస్ ప్రణీత్రావు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. దీంతో తీర్పును గురువారానికి రిజర్వు చేస్తున్నట్టు న్యాయమూర్తి జస్టిస్ జీ రాధారాణి ప్రకటించారు. అంతకుముందు పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్రావు వాదన వినిపిస్తూ.. ఈ కేసుకు సంబంధించిన వాస్తవాలను కింది కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని, నిబంధనలకు విరుద్ధంగా ప్రణీత్ను పోలీస్ కస్టీకి అప్పగించిందని తెలిపారు. కస్టడీకి సంబంధించిన నిబంధనలను పోలీసులు పాటించడం లేదని, కార్యాలయ పనివేళల్లో కాకుండా ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు ప్రణీత్ను విచారిస్తున్నారని, విరామం లేకుండా 12 గంటలపాటు విచారణ జరపడం చట్ట వ్యతిరేకమని వివరించారు.
ఈ విచారణకు ప్రణీత్ బంధువులను, న్యాయవాదిని అనుమతించడం లేదని, దర్యాప్తునకు సంబంధించిన అంశాలను పోలీసులు ఉద్దేశపూర్వకంగా మీడియాకు లీక్ చేసి ప్రణీత్ పరువుకు భంగం కలిగిస్తున్నారని తెలిపారు. పోలీసుల కస్టడీ, దర్యాప్తు నిర్ధిష్ట ప్రదేశంలో జరిగేలా చూడాలని, ఇంటరాగేషన్లో ఏఎస్పీ డీ రమేశ్ పాల్గొనకుండా కట్టడి చేయాలని కోరారు. అనంతరం పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వర్రావు వాదిస్తూ.. ప్రణీత్రావుపై దర్యాప్తు చట్ట ప్రకారమే జరగుతున్నదని, విచారణ సమయంలో పోలీసులు ఆయన న్యాయవాదులను అనుమతిస్తున్నారని తెలిపారు. ప్రణీత్ తన న్యాయవాది ఫోన్ నుంచే తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాడని చెప్పారు. పిటిషనర్ నుంచి కీలక విషయాలను రాబట్టాల్సి ఉన్నందున పోలీస్ కస్టడీ యథావిధిగా కొనసాగించాలని కోరారు. దీంతో ఇరుపక్షాల వాదనలు పూర్తయినందున తీర్పును గురువారం వెలువరిస్తామని జస్టిస్ జీ రాధారాణి తెలిపారు.