హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): హుక్కా కేంద్రాల నిర్వహణలో పోలీసుల జోక్యాన్ని సవాలు చేస్తూ దాఖలైన 68 పిటిషన్లపై హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. తమ వ్యాపారాల్లో పోలీసులు జోక్యం చేసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని హుక్కా సెంటర్ల నిర్వాహకులు దాఖలు చేసిన ఈ పిటిషన్లపై జస్టిస్ సీవీ భాస్కర్రెడ్డి ఇటీవల విచారణ పూర్తిచేశారు. హుక్కా కేంద్రాలను చట్టబద్ధంగా నిర్వహిస్తే జోక్యం చేసుకోబోమని పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంతోష్ కుమార్ హైకోర్టుకు హామీ ఇచ్చారు. నిబంధనలను ఉల్లంఘిస్తే జోక్యం చేసుకునే అధికారం పోలీసులకు ఉ న్నదని పేర్కొన్నారు. పిటిషనర్లు తమ కేంద్రాలను చట్టానికి అనుగుణంగా నిర్వహిస్తున్నట్టు ఎక్కడా చెప్పడం లేదని, హుక్కా కేంద్రాల్లో ఏ ఉత్పత్తిని అమ్ముతున్నారో కూడా వెల్లడించడం లేదని, పోలీసులు జోక్యం చేసుకోకూడదని మాత్రమే కోరుతున్నారని వివరించారు.
ఈ నేపథ్యంలో వారి పిటిషన్లను తోసిపుచ్చాలని కోరారు. అసలు హుక్కా పార్లర్, హుక్కా కేంద్రం అనే పదాలకు చట్టంలో నిర్వచనమే లేదని గుర్తుచేశారు. హుక్కాలో చాల్ కోల్ వినియోగిస్తారని, అందుకు లైసెన్సు తీసుకోకపోవడం చెల్లదని తెలిపారు. ఈ కేంద్రాల నిర్వహణ వల్ల సమాజానికి జరిగే నష్టాన్ని కూడా బేరీజు వేయాలని హైకోర్టును కోరారు. దీనిపై పిటిషనర్ల తరఫు న్యాయవాదులు స్పందిస్తూ.. పొగాకు ఉత్పత్తులపై ప్రభుత్వం విధించిన నిషేధం, అందుకు సంబంధించిన ప్రకటనలకు అనుగుణంగానే హుక్కా కేంద్రాలను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. వీటిని మూసేస్తే ఎంతోమంది జీవనోపాధి దెబ్బతింటుందని పేర్కొన్నారు. అనంతరం ఇరుపక్షాల వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వులో పెడుతున్నట్టు హైకోర్టు ప్రకటించింది.