హైదరాబాద్, నవంబర్ 14, (నమస్తే తెలంగాణ): మరణించినవారు, మరో ప్రాంతానికి వెళ్లినవారు, స్థానికంగా నివసించనివారితోపాటు ద్వంద్వ, బోగస్ ఓటర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని కోరుతూ నాంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ ఫిరోజ్ఖాన్ తీరుబడిగా పిటిషన్ దాఖలు చేయడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని చెప్తూనే అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక హైకోర్టుకు ఆశ్రయించడం ఏమిటని, గత 3 నెలలుగా ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. ఆ తరహా ఓటర్ల జాబితా ఏ నిబంధన కింద ఉండాలో తెలియజేయాలని, అందుకు అనుగుణంగా పిటిషన్ను సవరించాలని స్పష్టం చేసింది.
ఎన్నికల సంఘం అధికారులు అధికారపార్టీకి అనుకూలంగా వ్యవహరించారని, మరణించినవారితోపాటు స్థానికంగా వేరే ప్రాంతానికి వెళ్లినవారిని ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని ఈ నెల 3, 11న ఎన్నికల అధికారులను కోరినా చర్యలు తీసుకోలేనని ఆరోపిస్తూ ఫిరోజ్ఖాన్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్ ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. దీనిపై ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ ప్రతివాదన చేస్తూ.. రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ మొదలైందని, ఎవరికైనా అభ్యంతరాలుంటే పోలింగ్కు 5 రోజుల ముందు వరకు తెలియజేయవచ్చని స్పష్టం చేశారు.
ఆబ్సెంట్, షిప్ట్, డెత్, డూప్లికేట్ (ఏఎస్డీఅండ్డీ) ఓటర్ల జాబితా ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి వద్ద ఉంటుందని, ఆ జాబితాలో ఉన్నవారు ఓటు వేయడానికి వీల్లేదని తెలిపారు. దీంతో ఏ నిబంధన కింద ఏఎస్డీఅండ్డీ జాబితా ఇవ్వాలో చెప్పాలంటూ పిటిషనర్ను ఆదేశించిన ధర్మాసనం.. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.