హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు గుమిగూడకుండా చర్యలు చేపట్టాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అవసరమైతే రాజకీయ, మతపరమైన సభలు, సమావేశాలపై నిషేధం విధించాలని స్పష్టం చేసింది. కొవిడ్పై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్చంద్రశర్మ, జస్టిస్ అభినంద్కుమార్ షావిలితో కూడిన ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ జరిపింది. రాష్ట్రంలో కొవిడ్ పరీక్షల సంఖ్య మరింత పెంచాలని, లేనిపక్షంలో కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేయాలని సూచించింది. సినిమా హాల్స్, మాల్స్, వారాంతరపు సంతల్లో కొవిడ్ మార్గదర్శకాలు కట్టుదిట్టంగా అమలయ్యేలా, ప్రతి ఒక్కరూ మాసులు ధరించేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించింది. రాష్ట్ర సరిహద్దులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో కూడా కొవిడ్ పరీక్షలు నిర్వహించాలని, పిల్లల కోసం నిలోఫర్తోపాటు మరో దవాఖానను ఏర్పాటు చేయాలని సూచించింది. సంక్రాంతి సెలవుల్లో అత్యవసరమైతేనే కేసులు వేయాలని కక్షిదారులకు తెలియజేస్తూ.. తదుపరి విచారణను ఈ నెల 17కి వాయిదా వేసింది. ఆ లోగా కొవిడ్ కేసుల కట్టడికి చేపట్టిన చర్యలపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఉత్తర్వులు జారీచేసింది.