హైదరాబాద్, జనవరి 1, (నమస్తే తెలంగాణ): ఒకే తరహా విధులు నిర్వహించే ఉద్యోగులకు ఒకే తరహా జీతాలు చెల్లించాలని జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పోస్టుగ్రాడ్యుయేషన్ చేసిన వారికి, డిగ్రీ చేసిన వారికి వేర్వేరు విధాల జీతాలు చెల్లించడం సబబుకాదని స్పష్టంచేసింది. తమ తీర్పు ఉత్తర్వులు అందిన ఎనిమిది వారాల్లోగా పిటిషనర్ల వేతనాల్లో వ్యత్యాసాలను సరిచేయాలని ఆదేశించింది. పోస్టు గ్రాడ్యుయేషన్ చేసిన వారికి ఒకలా, డిగ్రీ చేసిన వారికి మరొకలా వేతనాలు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఏపీ రాష్ట్ర హెచ్ఐవీ కౌన్సిలర్స్ అండ్ టెక్నిషీయన్స్ యూనియన్ 2012లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఒకే పనికి ఒకే వేతనం ఉండకపోవడం రాజ్యాంగ విరుద్ధమని, అందరికీ సమాన వేతనాలు చెల్లించేలా ఉత్తర్వులు ఇవ్వాలన్న పిటిషనర్ వాదనతో కోర్టు ఏకీభవించింది.