హైదరాబాద్, అక్టోబర్ 21(నమస్తే తెలంగాణ): ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో ఏఐసీటీఈ, జేఎన్టీయూ ఆమోదించిన సీట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతించాలన్న గత ఉత్తర్వులను అమలు చేయని రాష్ట్ర ప్రభుత్వ తీరుపై హైకోర్టు నిప్పులు చెరిగింది. సీట్ల భర్తీకి మాప్ అప్ కౌన్సెలింగ్ నిర్వహించాలని సెప్టెంబర్ 9న ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడం.. ఉద్దేశపూర్వకంగా కోర్టు ధికారానికి పాల్పడినట్టుగా అనిపిస్తున్నదని వ్యాఖ్యానించింది. కోర్టు ఉత్తర్వులను అమలు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేనట్టున్నదని మండిపడింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై దాఖలు చేసిన అప్పీలును సుప్రీంకోర్టు కొట్టివేసిన తర్వాత కూడా ఎందుకు అమలు చేయలేని నిలదీసింది. సీట్లు పెంపుదల చేయాల్సిన కాలేజీలు మరో రాజకీయ పార్టీకి చెందినవి కావడం వల్లే పెంపుదల చేయలేదా? అంటూ సందేహం వ్యక్తంచేసింది.
ప్రత్యర్థి పార్టీకి చెందిన కాలేజీలు అయినందున పెరిగిన సీట్లకు అనుమతించడం లేదన్నట్టు అనిపిస్తున్నదని వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఈ నెల 23వ తేదీతో సీట్ల భర్తీ ప్రక్రియ ముగిసిపోనుందని గుర్తుచేసింది. ఆ తర్వాత కాలేజీలకు అనుకూలంగా ఉత్తర్వులు జారీచేస్తే ఏం ఉపయోగం అని ప్రశ్నించింది. ఏఐసీటీఈ అనుమతించిన సీట్లను భర్తీ చేసుకోవడానికి కాలేజీలకు అనుమతిస్తున్నట్టు ప్రకటించింది. అయితే, ప్రైవేటు కాలేజీలు ఎలాంటి క్యాపిటేషన్ ఫీజు వసూలు చేయరాదని షరతు విధించింది. కోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినట్టు కనిపిస్తున్నందున ప్రభుత్వంపై కోర్టు ధికరణ కింద ఎందుకు శిక్ష విధించరాదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ ఏ శ్రీదేవసేన, ఉన్నత విద్యా శాఖ కన్వీనర్ శ్రీరాంవెంకటేశ్, టీజీఈ ఏపీసెట్ కన్వీనర్ డాక్టర్ బీ డీన్కుమార్కు కోర్టుధికార నోటీసులు జారీచేసింది.
ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో ఏఐసీటీఈ, జేఎన్టీయూలు ఆమోదించిన మేరకు సైబర్ సెక్యూరిటీస్ వంటి కంప్యూర్సైన్స్, ఇతర కోర్సుల్లో సీట్ల పెంపునకు అనుమతివ్వాలని, మాప్అప్ కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లను భర్తీచేయాలని గత నెల 9న ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై ఎంజీఆర్, సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీ, చంద్రమ్మ ఎడ్యుకేషనల్ సొసైటీ, మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ, కేఎంఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ, ఎంఎల్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, విద్యాజ్యోతి ఎడ్యుకేషనల్ సొసైటీ తదితర కాలేజీలు కోర్టు ధికరణ పిటిషన్లు దాఖలుచేశాయి. వాటిపై ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్ రాహుల్రెడ్డి చేసిన వాదనలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. ప్రభుత్వ వాదనలపై కౌంటర్ వేసేందుకు సమయం కావాలని రాహుల్రెడ్డి కోరడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసినట్టు రాహుల్రెడ్డి చెప్పగా, అకడేమీ మధ్యంతర ఉత్తర్వులు రాలేదు కదా అని నిలదీసింది.
పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు దేశాయ్ ప్రకాశ్రెడ్డి, ఎస్ నిరంజన్రెడ్డి వాదిస్తూ, కోర్టు ధికరణ చట్టం కింద్ర 6 నెలల జైలు శిక్ష, జరిమానా విధించే విధంగా అధికారుల చర్యలు ఉన్నాయని చెప్పారు. దీనిపై స్పందించిన హైకోర్టు, ఏవిధంగా కోర్టు ఉత్తర్వుల అమలు నిలిపివేతను సమర్థించుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అక్టోబర్ ఒకటిన రివ్యూ పిటిషన్ దాఖలు చేసి కోర్టు ఉత్తర్వులను అమలు చేయకుండా తప్పించుకునేందుకు ప్రయత్నం చేయవద్దని తేల్చిచెప్పింది. ఒక తప్పు జరిగినపుడు దాన్ని సరిచేసుకునే ప్రయత్నం చేయలేదని, తాము ఆ తప్పును కొనసాగించలేమని వెల్లడించింది.
తిరిగి ప్రభుత్వ న్యాయవాది రాహుల్రెడ్డి కల్పించుకుని ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించలేదని, కౌన్సెలింగ్ పూర్తయిందని, లక్ష మంది పైగా విద్యార్థుల అడ్మిషన్లు జరిగిన కారణంగా సీట్ల పెంపు ఉత్తర్వులను అమలు చేయలేకపోయారని వివరించారు. ఈ సమయంలో మాప్ అప్ కౌన్సెలింగ్ చేయడం కష్టసాధ్యమని అన్నారు. హైకోర్టు ఆగ్రహం నేపథ్యంలో విచారణ మధ్యాహ్నానికి వాయిదా పడింది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్రెడ్డి వాదిస్తూ, సుప్రీంకోర్టు ఉత్తర్వులను తిరిగి సమీక్షించాలని ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేసిందని చెప్పారు. తాము ఆ ఉత్తర్వుల వివరాల్లోకి వెళ్లడం లేదని, కోర్టుధికార పిటిషన్ వరకే పరిమితమై విచారణ చేస్తున్నామని ధర్మాసనం స్పష్టంచేసింది. సీట్ల పెంపునకు సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ఈ నెల 23వ తేదీతో ముగిసిపోతున్నందున, ఆ సీట్ల పెంపునకు పిటిషనర్ కాలేజీలకు అనుమతిస్తున్నట్టు ఉత్తర్వులు జారీచేసింది. చట్ట ప్రకారం కోర్టుధికరణకు పాల్పడిన అధికారులపై ఏమేరకు శిక్ష విధించాలో తేల్చుతామని వెల్లడించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.