హైదరాబాద్/ఆలంపూర్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర శాసనసభకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో 12 మంది అభ్యర్థుల విజయాన్ని సవాలు చేస్తూ ఎలక్షన్ పిటిషన్లు దాఖలయ్యాయి. వారిలో ఇప్పటికే ఇద్దరికి (గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు) నోటీసులు జారీచేసిన హైకోర్టు.. శుక్రవారం మరో 6 పిటిషన్లపై విచారణ జరిపి ఆయా ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాసరెడ్డి (మహబూబ్నగర్), గవిగోళ్ల మధుసూదన్రెడ్డి (దేవరకద్ర), బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి (ఆసిఫాబాద్), మాగంటి గోపీనాథ్ (జూబ్లీహిల్స్), సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (కొత్తగూడెం)తోపాటు బీఆర్ఎస్ తరఫున గెలిచి ఇటీవల కాంగ్రెస్లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఇంకా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి (వరంగల్ పశ్చిమ), వెడ్మ బొజ్జు (ఖానాపూర్), రాందాస్ మాలోత్ (వైరా), బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు (కూకట్పల్లి)కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరపాల్సి ఉన్నది.
ఎలాంటి నోటీసులు అందలేదు: విజయుడు
హైకోర్టు నుంచి తనకు ఎలాంటి నోటీసులు అందలేదని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు తెలిపారు. ఎన్నికల నిబంధనలను ఎన్నడూ ఉల్లంఘించలేదని ఆయన చెప్పారు. గతంలో ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేసిన తాను అసెంబ్లీ ఎన్నికలకు 6 నెలల ముందే ఆ ఉద్యోగానికి రాజీనామా చేశానని, నామినేషన్ దాఖలు సమయంలోనే ఆ రాజీనామా పత్రాన్ని అందజేశానని, నోటీసు వచ్చినా వివరణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.