హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర హైకోర్టులో జరిగే కేసుల విచారణను అక్టోబర్ 10 నుంచి ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. మొదటి కోర్టు హాల్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని ధర్మాసనం జరిపే కేసుల విచారణను మొట్టమొదటగా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈ ఫలితాలను బట్టి ధర్మాసనం తీసుకునే నిర్ణయాల మేరకు తదుపరి చర్యలు ఉంటాయని హైకోర్టు తెలిపింది. దేశ చరిత్రలోనే తొలిసారి ఆన్లైన్లో కేసుల విచారణ జరిపింది కూడా తెలంగాణ హైకోర్టే కావడం గమనార్హం. కొవిడ్ నేపథ్యంలో మన హైకోర్టు తర్వాతే సుప్రీంకోర్టు, ఇతర హైకోర్టులు ఆన్లైన్ విచారణ చేపట్టాయి. కేసుల విచారణను సామాన్యులు సైతం వీక్షించే విధంగా సుప్రీంకోర్టు ఇటీవలే ప్రత్యక్ష ప్రసారానికి శ్రీకారం చుట్టింది. ఇందుకు తెలుగు వ్యక్తి, తాజా మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ తొలిసారి అవకాశం కల్పించారు. ఆగస్టు 26న తొలిసారిగా సుప్రీంకోర్టు కార్యకలాపాలు ప్రత్యక్ష ప్రసారం అయ్యాయి. జాతీయ ప్రాధాన్యం ఉన్న కేసులతోపాటు రాజ్యాంగ అంశాలకు సంబంధించిన కేసులను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. ఈ మేరకు మంగళవారం నుంచి రాజ్యాంగ ధర్మాసనం కేసుల విచారణ ప్రత్యక్ష ప్రసారం ప్రారంభమైంది. ప్రస్తుతం కేసుల విచారణను యూట్యూబ్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామని, త్వరలోనే సొంత మాధ్యమాన్ని ఏర్పాటు చేసుకుంటామని చీఫ్ జస్టిస్ లలిత్ పేర్కొన్నారు. ప్రస్తుతానికి రాజ్యాంగ ధర్మాసనం కేసులను మాత్రమే లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నారు. త్వరలో ఇతర కేసులకూ దీన్ని విస్తరించనున్నారు.