హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరాలను మరింత సమర్థంగా అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నదని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ శ్యామ్ కోషి, జస్టిస్ కే లక్ష్మణ్ ఉద్ఘాటించారు. సైబర్ నేరాలపై చర్చించేందుకు హైదరాబాద్ తగిన ప్రదేశమని అభిప్రాయపడ్డారు. సైబర్ నేరాలపై శనివారం రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీలో ప్రారంభమైన వర్షాప్లో వారు మాట్లాడుతూ.. సమాజంలోని అట్టడుగు వర్గాల ప్రజలకు సైతం ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నందున సైబర్ నేరాలపై వారిని అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు.
అవినీతిని నిరోధించేందుకు ఆర్థిక లావాదేవీలన్నీ డిజిటల్ రూపంలో జరగాలని కేంద్ర ప్రభుత్వం కోరుకుంటున్నదని చెప్పారు. కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పీ వెంకట జ్యోతిర్మయి, జస్టిస్ అతుల్ శ్రీధరన్, జస్టిస్ నిర్మల్ కుమార్, జస్టిస్ శక్తివేల్, జస్టిస్ అనూప్ చిటారా, జస్టిస్ రవినాథ్ తిలహరి, జస్టిస్ స్వర్ణకాంతశర్మతోపాటు జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్ మంగరి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.