Birth Certificate | హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ) : కులం, మతం ప్రస్తావన లేకుండా జనన ధ్రువీకరణ పత్రం కావాలని కోరుకునే హకు పౌరులకు ఉన్నదని హైకోర్టు స్పష్టం చేసింది. అలాంటి వారి కోసం దరఖాస్తులో కులరహితం, మతరహితం అనే ప్రత్యేక కాలమ్ను ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలిత బుధవారం చారిత్రక తీర్పు వెలువరించారు. కులాన్ని, మతాన్ని వదులుకునే హకు ప్రతి పౌరుడికీ ఉంటుందని, దానిని అడ్డుకునే హకు ఎవరికీ లేదని తేల్చిచెప్పారు. కులం, మతం ప్రస్తావన లేకుండా జనన ధ్రువీకరణ దరఖాస్తులను స్వీకరించేలా చర్యలు తీసుకోవాలని పురపాలక, విద్యా శాఖల ముఖ్య కార్యదర్శులతోపాటు మున్సిపల్ కమిషనర్లకు ఉత్తర్వులు జారీ చేశారు.
కుల, మత ప్రస్తావన లేకుండా తమ బిడ్డ జనన ధ్రువీకరణ దరఖాస్తును స్వీకరించేందుకు మున్సిపల్ కమిషనర్ నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్కు చెందిన సందెపాగు రూప, డేవిడ్ దంపతులు 2019లో హైకోర్టును ఆశ్రయించడంతో ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం పౌరులకు నచ్చిన మతాన్ని విశ్వసించే స్వేచ్ఛ ఉన్నట్టుగానే తమకు నమ్మకం లేని మతాన్ని వదులుకునే హకు కూడా ఉన్నదని హైకోర్టు ఈ సందర్భంగా గుర్తుచేసింది.