గోదావరిఖని, మార్చి 23: సింగరేణి సంస్థలో కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల ప్రక్రియను జూన్లో జరుపుకోవచ్చని గురువారం హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల నిర్వహణపై సింగరేణి యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. యాజమాన్యం పేర్కొన్న ఆంశాలను పరిగణనలోకి తీసుకొన్న కోర్టు పైతీర్పునిచ్చింది. ఏప్రిల్ 2న ఆర్ఎల్సీ సమక్షంలో సమావేశం జరుగనుండటంతో ఎన్నికలు జూన్ తర్వాతే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సింగరేణి సంస్థలో ఏప్రిల్, మే, జూన్ మొదటి త్రైమాసికంలో బొగ్గు ఉత్పత్తి అధికంగా చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు తక్కువగా ఉన్నాయి. ఎన్నికలు జరిగితే బొగ్గు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడి విద్యుదుత్పత్తికి అంతరాయం కలుగుతుందన్న వాదనపై హైకోర్టు ఏకీభవించింది. దీంతో ఎన్నికలు మరో రెండు నెలలు వాయిదా పడే అవకాశం ఉంది. గుర్తింపు ఎన్నికలు ఎప్పుడు జరిగినా గెలుపు తమదేనని టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.