Nagarjuna | హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ) : ‘మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు అసంబద్ధం. అబద్ధం’ అని సినీ నటుడు అక్కినేని నాగార్జున స్పష్టంచేశారు. ‘రాజకీయాలకు దూరంగా ఉండే సినీప్రముఖుల జీవితాలను, మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోకండి.. సాటి మనుషుల వ్యక్తిగత జీవితాలను గౌరవించండి’ అని సూచించారు. సురేఖ వ్యాఖ్యలను బుధవారం ఎక్స్ వేదికగా ఆయన ఖండించారు. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మంత్రి కొండా సురేఖ వాఖ్యలు తమ కుటుంబం పట్ల, చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధమని, అబద్ధమని తేల్చిచెప్పారు. తక్షణమే ఆమె తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రాహుల్ గాంధీ స్పందించాలి: అమల
తమ కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన అసంబద్ధ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీకి సినీనటుడు అక్కినేని నాగార్జున సతీమణి, నటి అకినేని అమల ఫిర్యాదుచేశారు. తన కుటుంబంపై సురేఖ అసత్య ఆరోపణలు చేశారని మండిపడ్డారు. రాజకీయ వివాదాల్లోకి తమను లాగవద్దని, తన భర్త గురించి నిరాధార ఆరోపణలు చేయడం సిగ్గుచేటని ఘాటుగా స్పందించారు. ‘రాజకీయ నాయకులే నేరస్థుల్లా ప్రవర్తిస్తే ఈ దేశం ఏమైపోతుంది? సురేఖ తన వ్యాఖ్యలను వెనకి తీసుకుని క్షమాపణలు చెప్పేలా రాహుల్గాంధీ చొరవ తీసుకోవాలి’ అని అమల డిమాండ్ చేశారు.