TS Weather | రాష్ట్రంలో ఎండలు క్రమంగా పెరుగుతున్నాయి. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలు దాటాయి. రాత్రి పూట 26 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదయ్యాయి. సోమవారం మధ్యాహ్నం వరకు నిర్మల్ జిల్లా అక్కాపూర్లో 41.1, డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత నిజామాబాద్ మోర్తాడ్లో 41 డిగ్రీలు, ఆసిఫాబాద్ (కుమ్రంభీం) 40.9, చాప్రాలా (ఆదిలాబాద్) 40.8, రైనిగూడెం (సూర్యాపేట) 40.7, కోరట్పల్లి (నిజామాబాద్) 40.7, వడ్డేమాన్ (మహబూబ్నగర్) 40.6, దస్తూరాబాద్ (నిర్మల్) 40.6, ఆదిలాబాద్ 40.5, సిరికొండ 40.5, డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు టీఎస్డీపీఎస్ తెలిపింది.
రాబోయే రోజులు ఉష్ణోగ్రతలు మరో రెండు మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉదయం సమయంలో స్వల్పంగా ఆకాశం మేఘావృతమై ఉంటున్నది. మధ్యాహ్నం వరకు ఎండ దంచికొడుతున్నది. ఇక హైదరాబాద్లోనూ వచ్చే రాగల ఐదురోజులు ఎండ తీవ్రత కొనసాగు అవకాశం ఉందని.. ఉదయం సమయంలో పొగమంచు పరిస్థితులుంటాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ నెల 28, 29, 30 తేదీల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి శ్రావణి తెలిపారు. రాత్రిపూట 25-26 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఏప్రిల్ రెండో వారం నుంచి ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని.. ఏప్రిల్, మే మాసాల్లో వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపారు.