Kadem Project | ఆదిలాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు ముప్పు వాటిల్లకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గేట్ల ఆపరేటింగ్లో వస్తున్న సమస్యలను అధిగమించేందుకు.. నూతన సాంకేతిక విధానాన్ని వినియోగిస్తున్నది. ప్రాజెక్టుకు మరమ్మతుకు రూ.5 కోట్లు మంజూరు చేసింది. రెండ్రోజులుగా ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. శుక్రవారం 1.60 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండటంతో అధికారులు 14 గేట్లు ఎత్తి 1.70 లక్షల నీటిని వదిలారు. సాంకేతిక కారణాల వల్ల రెండు గేట్లు తెరచుకోలేదు. శనివారం వాటికి మరమ్మతులు చేపట్టి పైకి లేపారు. మరో రెండు గేట్లు నెల రోజుల్లో పనిచేసేలా చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు.
నూతన టెక్నాలజీతో గేట్ల ఆపరేషన్
ప్రస్తుతం కడెం ప్రాజెక్టు గేట్ల ఆపరేటింగ్ మ్యాన్యువల్ నిర్వహిస్తుండటంతో సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. దీని పరిష్కారానికి నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు ఆధ్వర్యంలో స్కాడా (సూపర్ వైజరీ కంట్రోల్ అండ్ డాటా ఎక్విజేషన్) విధానంలో ఆధునిక యంత్రాలను బిగిస్తున్నారు. 18 గేట్లను కంట్రోల్ రూం నుంచి నిర్వహించనున్నారు. పరికరాలకు సెన్సార్లు బిగించారు.
పకడ్బందీ చర్యలు : రాథోడ్ విఠల్, ఈఈ, కడెం ప్రాజెక్టు
శుక్రవారం 14 గేట్ల ద్వారా 1.70 లక్షల క్యూసెక్కుల నీటిని వది లాం. శనివారం రెండు గేట్లకు మరమ్మతులు చేసి పైకి లేపాం. ప్రస్తుతం 16 గేట్ల ద్వారా 2.75 లక్షల క్యూసెక్కుల నీటిని వదిలాం. అధికారులు నిరంతరం ప్రాజెక్టు వద్ద విధులు నిర్వహిస్తూ ప్రాజెక్టు ఇన్ఫ్లోను పరిశీలిస్తున్నారు.