ద్రోణితో పలు జిల్లాలో భారీగా..
పదేండ్ల కనిష్ఠస్థాయికిఉష్ణోగ్రతలు
హైదరాబాద్ వాతావరణ కేంద్రం
Telangana | హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురవనున్నాయి. పలు జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, ఇంటీరియల్ కర్ణాటక మీదుగా ద్రోణి కొనసాగుతుండటంతో తెలంగాణ, ఏపీలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్నగర్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో వడగండ్లతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములు గు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వడగళ్ల వర్షాలు కురవచ్చని పేర్కొన్నది.
రాష్ట్రం నిండు వేసవిలో వర్షాకాలాన్ని తలపిస్తున్నది. పదేండ్లలో కనిష్ఠ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హనుమకొండలో సాధారణం కన్నా 10.3 డిగ్రీలు తగ్గి 30.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్లో 9.1 డిగ్రీలు తగ్గి 33.2 డిగ్రీలు, భద్రాచలంలో 8.1 డిగ్రీ తగ్గి 32, మహబూబ్నగర్లో 7.7 డిగ్రీలు తగ్గి 32.5 డిగ్రీలు, హైదరాబాద్లో 7.5 డిగ్రీలు తగ్గి 31.9 డిగ్రీలు, నిజామాబాద్లో 7.2 డిగ్రీలు తగ్గి 34.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.