హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానలకు వాగులు, వంకలు పారి రిజర్వాయర్లలోకి భారీగా నీరు చేరుతున్నది. గడిచిన 24 గంటల్లో జగిత్యాల జిల్లాల్లో అత్యంత భారీ వర్షం కురిసింది. 21 జిల్లాల్లో అతి భారీ వర్షాలు, హైదరాబాద్తో సహా మొత్తం 28 జిల్లాల్లో భారీ వానలు పడ్డాయి. అత్యధికంగా జగిత్యాల జిల్లా సారంగపూర్లో 12.98 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. 20 ప్రాంతాల్లో 10 సెంటీ మీటర్లపైన వర్షం కురిసింది. బుధవారం కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. ఈ నెల 25 వరకు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది.
వాన నీటిలో మునిగిన పెండ్లి బస్సు
రైల్వే అండర్బ్రిడ్జి వద్ద చేరిన నీటిలో ఓ పెండ్లి బస్సు మునిగిన ఘటన వికారాబాద్ జిల్లా మోమిన్పేట మండలంలో చోటుచేసుకొన్నది. ప్రయాణికులు ముందే దిగి వెళ్లడంతో ప్రమాదం తప్పింది. హైదరాబాద్ బోరబండకు చెందిన వధువు బంధువులు సోమవారం ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సులో వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం బార్వాదిలో వివాహం ముగించుకొని బయలుదేరారు. మొరంగపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి కింద బురదలో బస్సు చిక్కుకోగా, స్థానికుల సహాయంతో బయటకు తీశారు.